హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ తమ జోరు కొనసాగిస్తోంది. ఉప్పల్ మైదానం వేదికగా నెదర్లాండ్స్తో జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ 323 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి మ్యాచ్లో శతక్కొట్టిన రచిన్ రవీంద్ర(51 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 51) ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించాడు.
అతనికి తోడుగా విల్ యంగ్(80 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 70), టామ్ లాథమ్(46 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 53) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 322 పరుగులు చేసింది.

డెవాన్ కాన్వే(40 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 32)తో పాటు మిచెల్ సాంట్నర్(17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లతో 36 నాటౌట్), డారిల్ మిచెల్(47 బంతుల్లో 5 ఫోర్లు, 2సిక్స్లతో 48) పర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్, పాల్ వాన్, రోయిలోఫో వాన్ డెర్ మార్వె రెండేసి వికెట్లు తీయగా.. బాస్ డీ లీడే ఓ వికెట్ పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్కు ఓపెనర్లు కాన్వే, విల్ యంగ్ మంచి ఆరంభాన్ని అందించారు. పవర్ ప్లేలోనే వికెట్ కోల్పోకుండా 63 పరుగులు జోడించారు. అనంతరం ఈ జోడీ కాస్త నెమ్మదించగా.. కాన్వేను వాన్ డెర్ మార్వె పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో రచిన్ రవీంద్రతో కలిసి విల్ యంగ్ సూపర్ నాక్ ఆడాడు.
ఈ ఇద్దరూ మూడో వికెట్కు 77 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా సాగుతున్న విల్ యంగ్ను పాల్ వాన్ ఔట్ చేయగా.. డారిల్ మిచెల్తో కలిసి రచిన్ రవీంద్ర ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. హాఫ్ సెంచరీ అనంతరం రచిన్ రవీంద్ర కూడా ఔటవ్వడంతో డారిల్ మిచెల్, టామ్ లాథమ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 53 పరుగులు జోడించారు. చివర్లో మిచెల్ సాంట్నర్ మెరుపు మెరిపించాడు.