కోల్కతా: దేశంలోని ప్రఖ్యాత స్టేడియం అయిన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 2023 వన్డే ప్రపంచకప్ కోసం స్టేడియంలో మరమ్మతులు చేస్తుండగా డ్రెస్సింగ్ రూమ్లో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. వీటిని గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ సమాచారం అందించి మంటలు ఆర్పేసారు.
రెండు ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగి ఆస్థి నష్టాన్ని తగ్గించాయి. షార్ట్ సర్య్యూట్ కారణంగానే ఈ ప్రమాదరం జరిగిందని అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు లేవు. డ్రెస్సింగ్ రూమ్లోని పాల్సీలింగ్లో ఈ మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. క్రికెటర్లు తమ సామ్రగ్రిని భద్రపర్చుకోవడానికి ఈ గదిని వాడుతుంటారు.

మంటల ధాటికి ఆ గదిలో ఫర్నీచర్తో పాటు క్రికెటర్ల సామగ్ని మొత్తం దగ్దమైనట్లు తెలుస్తోంది. అగ్ని ప్రమాదం వార్త తెలియగానే క్రికెట్ అసోసియేషన్ బెంగాల్(క్యాబ్) జాయింట్ సెక్రటరీ దేవ్రత్దాస్ మైదానానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. స్వల్ప నష్టమే జరిగిందన్న ఆయన.. ఆటగాళ్లకు సంబంధించిన సామగ్రి దగ్దమైందని తెలిపాడు.
ప్రపంచకప్కు ఇంకా రెండు నెలలు ఉందనగా ఈ ఘటన చోటు చేసుకోవడం భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)కి కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టింది. ఈ మైదానంలోని ఫైర్ సేఫ్టీపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ మ్యాచ్ జరగాలంటే అగ్నిమాపకశాఖ అనుమతులు తప్పనిసరి. మరోవైపు ఆటగాళ్ల కోసం మరో కొత్త డ్రెస్సింగ్ రూమ్ నిర్మణాన్ని కూడా శరవేగంగా చేపట్టారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రపంచకప్ కోసం వేగంగా మరమ్మతు పనులు చేస్తున్నారు. సెప్టెంబర్ 15 నాటికి వీటిని పూర్తి చేయాలని క్యాబ్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఇక్కడ జరుగుతున్న పనులపై ఐసీసీ ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే నెలలో మరోసారి ఈ మైదానాన్ని తనిఖీ చేయనున్నారు.
ఈ మెగా టోర్నీకి సంబంధించిన రీషెడ్యూల్ను బుధవారమే ప్రకటించారు. మొత్తం 9 మ్యాచ్లను మార్చారు. అక్టోబర్ 5 నుంచి ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.