న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షాపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ బలంతో గత కొన్నాళ్లుగా బీసీసీఐ షాడో ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్న జై షా.. అనాలోచిత నిర్ణయాలతో భారత జట్టుకు తీవ్ర నష్టం చేస్తున్నాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 12 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై వన్డే ప్రపంచకప్ జరుగుతుండగా... సరైన ప్రాక్టీస్ లేకుండానే టీమిండియా మెగా టోర్నీలోకి బరిలోకి దిగుతోంది.
ఇంగ్లండ్, నెదర్లాండ్స్తో జరగాల్సిన రెండు వామప్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. దాంతో టీమిండియా ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే నేరుగా వరల్డ్ కప్ సమరానికి సిద్దమవుతోంది. అయితే టీమిండియాకు ఈ పరిస్థితి రావడానికి జైషానే కారణమని అభిమానులు ఆరోపిస్తున్నారు.

రాజకీయ దురుద్దేశంతోనే వరల్డ్ కప్ వేదికలను ఖరారు చేశారని, బీజేపీ పాలిత ప్రాంతాల్లోని మైదానాలకే టీమిండియా ప్రపంచకప్ మ్యాచ్లు కేటాయించారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సౌతిండియా ఫ్యాన్స్ జైషా అరాచకాలు ఎక్కువయ్యాయని మండిపడుతున్నారు. హైదరాబాద్లో టీమిండియాకు ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వకపోగా.. కనీసం వార్మప్ మ్యాచ్ కూడా కేటాయించ లేదు.
భారత వామప్ మ్యాచ్లను ఈశాన్యంలో గౌహతి, నైరుతిలో తిరువునంతపురంలో షెడ్యూల్ చేశారు. వర్షాల ధాటికి రెండు మ్యాచ్లు రద్దు కాగా.. హైదరాబాద్లో వామప్ మ్యాచ్లు ఆడిన పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లకు మంచి ప్రాక్టీస్ లభించింది. వార్మప్ మ్యాచ్ ఫలితాలతో వచ్చేది ఏం లేకున్నా.. జట్టు కూర్పుపై ఓ అంచనాకు రావచ్చు.
అలాగే ఆటగాళ్లకు తగిన మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తోంది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో కూడా ప్రధాన ఆటగాళ్లను టీమిండియా పక్కన పెట్టింది. చివరి మ్యాచ్కు వాళ్లు బరిలోకి దిగినా టీమిండియాకు ఓటమి తప్పలేదు. సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడంతో ఆటగాళ్లు రిథమ్ కోల్పోయి ఓటమికి తల వంచారు. క్రికెట్ రాని జైషా నేతృత్వంలోని బీసీసీఐ వివక్షకు ఇది పరాకాష్ట అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అసలు జై షాకు క్రికెట్తో ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం అతను క్లబ్ క్రికెట్ అయినా ఆడాడా..? అని ప్రశ్నిస్తున్నారు. మైదానంలో చిన్న పిల్లాడిలా కింది నుంచి వచ్చే బంతులను ఆడుతున్న జై షా వీడియోను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. గంగూలీ ప్రెసిడెంట్గా ఉంటే తన ఆటలు సాగడం లేదని జైషా దాదాను తప్పించాడని ఆరోపిస్తున్నారు.