World Cup 2023, IND vs NZ Semi Final: వన్డే ప్రపంచకప్లో టీమిండియా వరుస విజయాలతో సెమీస్ చేరింది. అద్భుత ప్రదర్శనతో ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లోనూ విజయం సాధించి ఓటమెరుగని జట్టుగా అందరికన్నా ముందు సెమీస్ బెర్త్ను దక్కించుకుంది. ఆదివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో నెదర్లాండ్స్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది.
ప్రస్తుత ఫామ్ నేపథ్యంలో నెదర్లాండ్స్ను ఓడించడం టీమిండియాకు పెద్ద కష్టమేం కాదు. పైగా ఈ మ్యాచ్లో ఓడినా భారత జట్టుకు వచ్చే నష్టం ఏం లేదు. కానీ నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్ట న్యూజిలాండ్ను ఓడించడం టీమిండియాకు సవాల్తో కూడుకున్న పనే.

లీగ్ దశలో ఆ జట్టును చిత్తు చేసినా.. సెమీఫైనల్ పోరును ఏమాత్రం లైట్ తీస్కోలేం. 2019 ప్రపంచకప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలోనే ఓడిన టీమిండియా.. 2021 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ ఆ జట్టు చేతిలోనే ఖంగుతిన్నది. అంతేకాకుండా మెగా టోర్నీల్లో న్యూజిలాండ్పై టీమిండియాకు మెరుగైన రికార్డు లేదు.
ఈ క్రమంలోనే న్యూజిలాండ్తో సెమీస్ పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సారి ఎలాగైనా న్యూజిలాండ్ను ఓడించి గత సెమీస్ ఓటమికి బదులు తీర్చుకోవాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా ఓ విషయం కలవరపెడుతోంది. నెదర్లాండ్స్తో జరిగే చివరి లీగ్ మ్యాచ్లో ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు.
టీమిండియా బ్యాటింగ్లో రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాలు అందిస్తుంటే.. మిడిలార్డర్లో విరాట్ కోహ్లీ అసాధారణ ఇన్నింగ్స్లు ఆడుతున్నారు. ఈ ఇద్దరికీ అండగా శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నారు. అయితే జట్టుకు మంచి ముగింపు అందించే ఫినిషర్ మాత్రం కరువయ్యాడు. హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉంటే ఆ బాధ్యతను అతను నిర్వర్తించేవాడు.

కానీ గాయంతో అతను జట్టుకు దూరం కాగా.. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఆ పాత్రను సమర్థవంతంగా పోషించడం లేదు. ఇంగ్లండ్తో మ్యాచ్లో 49 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన సూర్య.. సౌతాఫ్రికాతో మ్యాచ్లో 22 పరుగులే చేసాడు. అంతకుముందు న్యూజిలాండ్తో 2 పరుగులే చేశాడు. శ్రీలంకతో పోరులోనూ 9 పరుగులే చేశాడు.
ఈ క్రమంలోనే నెదర్లాండ్స్తో మ్యాచ్లోనైనా సూర్య ఫినిషర్గా సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కివీస్తో పోరుకు ముందు సూర్య కూడా చెలరేగితో టీమిండియాకు తిరుగుండదని అభిప్రాయపడుతున్నారు.