తిరువనంతపురం: వన్డే ప్రపంచకప్ 2023 నేపథ్యంలో నెదర్లాండ్స్తో జరగాల్సిన భారత వామప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. తిరువనంతపురం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా టాస్ కూడా పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. మ్యాచ్ ప్రారంభ సమయానికి ముందే మొదలైన వర్షం.. ఎడతెరిపి లేకుండా కురిసింది.
మధ్య కాస్త గడువు ఇవ్వగా.. కవర్లను తీసి చిత్తడిగా మారిన మైదానాన్ని ఆటకు సిద్దం చేసేందుకు గ్రౌండ్స్మెన్ తీవ్రంగా శ్రమించారు. అంతలోనే మరోసారి వర్షం రావడంతో ఆట నిర్వహించడం సాధ్యం కాదని భావించిన అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంగ్లండ్తో గువాహటి వేదికగా జరగాల్సిన భారత తొలి వామప్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా బంతి పడకుండానే రదయ్యింది.

దాంతో సన్నాహక మ్యాచ్లు లేకుండానే టీమిండియా మెగా టోర్నీ బరిలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ 2023 ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరిగే మ్యాచ్తో టీమిండియా తమ క్యాంపైన్ను షురూ చేయనుంది.
అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా దాయాదీ పాకిస్థాన్తో మెగా మ్యాచ్ ఆడనుంది. అయితే మెగా టోర్నీకి సన్నాహక మ్యాచ్లు లేకుండా బరిలోకి దిగడం టీమిండియాకు నష్టం చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో కూడా ప్రధాన ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. దాంతో భారత ఆటగాళ్లకు సరైన మ్యాచ్ ప్రాక్టీసే లేకుండా పోయింది.
అయితే రెండు వామప్ మ్యాచ్లు వర్షం కారణంగా రద్దవ్వడంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీసీఐ టీమిండియా సన్నాహక మ్యాచ్ల నిర్వహణ విషయంలో ఘోర తప్పిదం చేసిందని మండిపడుతున్నారు. వర్షాలు వచ్చే ప్రాంతాల్లో వామప్ మ్యాచ్లు షెడ్యూల్ చేయాల్సింది కాదని అభిప్రాయపడుతున్నారు.
బీసీసీఐ నిర్లక్ష్యం టీమిండియా కొంపముంచిందని, విశ్రాంతి నుంచి తిరిగి వస్తున్న ఆటగాళ్లు రిథమ్ అందుకునేందుకు కనీసం రెండు మ్యాచ్లు పడుతుందని కామెంట్ చేస్తున్నారు. అయితే భారత్ తమ తొలి రెండు మ్యాచ్లను ప్రధాన జట్లు అయిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్తో ఆడాల్సి ఉందని హెచ్చరిస్తున్నారు.
మెగా టోర్నీలో టీమిండియాను వరుణ గండం వెంటాడుతోంది. వర్షంతో మ్యాచ్కు అంతరాయం కలిగిన ప్రతీసారి టీమిండియాకు ప్రతికూల ఫలితమే ఎదురైంది. 2019 వన్డే ప్రపంచకప్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా రిజర్వ్డేతో కలుపుకొని రెండు రోజుల పాటు సాగింది.
బౌలింగ్లో సత్తా చాటిన టీమిండియా.. ఓవర్ కాస్ట్ కండిషన్స్ వల్ల బ్యాటింగ్లో విఫలమై ఓటమిపాలైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తొలి ఎడిషన్ ఫైనల్లోనూ టీమిండియాను వరణుడు కొంపముంచాడు. రిజర్వ్డేతో కలుపుకొని 6 రోజుల పాటు సాగిన మ్యాచ్లో వాతావరణ పరిస్థితులు టీమిండియా ఆటను ప్రభావితం చేశాయి.