చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023 తొలి పోరుకు టీమిండియా సిద్దమైంది. ఆదివారం చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే చెన్నై చేరి అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు శ్రమిస్తున్న భారత ఆటగాళ్లు.. నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. మెగా టోర్నీని విజయంతో ప్రారంభించాలనే కసితో తొలిపోరుకు సమాయత్తమవుతున్నారు.
కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్లో ఉండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. అయితే డెంగ్యూ బారిన పడిన శుభ్మన్ గిల్ తొలి మ్యాచ్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఆడే అవకాశం ఉంది.

మరోవైపు ఆస్ట్రేలియా కూడా భీకరంగా ఉంది. కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు డేవిడ్ వార్నర్, మిచెల్ స్టార్క్, జోష్ హజెల్ వుడ్, స్టీవ్ స్మిత్, గ్లేన్ మ్యాక్స్వెల్లతో ప్రమాదకరంగా కనబడుతోంది. ఇరు జట్లు బలబలాల పరంగా సమంగా ఉండటంతో రసవత్తర పోరు అభిమానులను అలరించనుంది.
ఇటీవలే ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగ్గా టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. ఈ విజయం రోహిత్ సేన ఆత్మ విశ్వాసాన్ని రెట్టింపు చేయనుంది. అయితే చెన్నై వేదికగా ఆసీస్కు మెరుగైన రికార్డు ఉంది. ఇక్కడ నాలుగు మ్యాచ్లు ఆడిన ఆసీస్ మూడింటిలో విజయం సాధించింది.
వర్ష గండం : ఇక ఈ మ్యాచ్కు వర్షం గండం పొంచి ఉంది. ఆదివారం 2 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. మధ్యాహ్న సమయంలో వర్షం వచ్చే అవకాశం ఉందని Accuweather పేర్కొంది. ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల సెల్సియస్ నమోదవుతాయని, 8 శాతం వర్షం వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఒకవేళ వర్షం వచ్చినా మ్యాచ్ను తుడిచిపెట్టుకుపోయే అవకాశం లేదు. కాసేపు మాత్రమే అంతరాయం కలిగించనుంది.
స్పిన్నర్లదే రాజ్యం :చెన్నైలోని చెపాక్ పిచ్పై స్పిన్నర్లదే హవా. గతంలో ఇక్కడ జరిగిన అన్నీ మ్యాచ్ల్లో స్నిన్నర్లే సత్తా చాటారు. డ్యూ రానున్న నేపథ్యంలో చేజింగ్ చేసే జట్టుకు అడ్వాంటేజ్ ఉండనుంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. స్పిన్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఇరు జట్లు ఎక్స్ట్రా స్పిన్నర్తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.