World Cup 2023లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా మరో ఆసక్తికరపోరుకు సిద్దమైంది. గురువారం వాంఖడే వేదికగా జరగనున్న మ్యాచ్లో శ్రీలంకతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్లకు ఆరు గెలిచిన టీమిండియా.. శ్రీలంకను కూడా ఓడించి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకోవాలని భావిస్తోంది.
6 విజయాలు.. 12 పాయింట్స్తో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమిండియా.. ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ మూడింటిలో ఒక్కటి గెలిచినా టీమిండియా సెమీస్ బెర్త్ ఖరారవుతోంది. చివరి మూడు మ్యాచ్లు గెలిస్తే.. 'టాపర్ ఆఫ్ ది టోర్నీ'గా సెమీస్కు చేరుకుంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా టీమిండియా పటిష్టంగా ఉంది.

అన్నింటికీ మించి సమష్టిగా రాణిస్తుండటం జట్టుకు కలిసొచ్చే అంశం. బ్యాటింగ్ తడబడితే బౌలర్లు సత్తా చాటుతున్నారు. టీమిండియా పేస్ అటాక్ ప్రత్యర్థులను బెంబేలెత్తిస్తోంది. బుమ్రా, షమీ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడుతున్నారు. స్పిన్ బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ మాయ చేస్తుండగా.. తనదైన రోజున జడేజా తిప్పేస్తున్నాడు.
సిరాజ్ ఒక్కడే కాస్త తడబడుతున్నాడు. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ మంచి ఫామ్లో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్ ఒక్కడే కాస్త ఇబ్బంది పడుతున్నాడు. షార్ట్ పిచ్ బాల్ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు. శ్రేయస్ క్రీజ్లో కుదురుకోగలిగితే మాత్రం భారీ ఇన్నింగ్స్ ఆడగలడు. స్పిన్ బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కోగలడు.
ముంబై పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో టీమిండియా కీలక మార్పులు చేసే అవకాశం ఉంది. ఆరంభంలో కాస్త స్పిన్కు అనుకూలించనున్న నేపథ్యంలో ఎక్స్ట్రా స్పిన్నర్ను తీసుకోవచ్చు. నెట్స్లో అశ్విన్ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. పైగా శ్రీలంకలో లెఫ్టార్మ్ బ్యాటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వ్యూహాత్మకంగా అతన్ని ఆడించవచ్చు.
జడేజాకు రెస్ట్ ఇచ్చి అశ్విన్ను ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎక్స్ట్రా పేసర్తో బరిలోకి దిగాలనుకుంటే మాత్రం సిరాజ్ స్థానంలో శార్ధూల్ ఠాకూర్ను ఆడించవచ్చు. గత రెండు మ్యాచ్ల్లో సిరాజ్ దారుణంగా విఫలమయ్యాడు. బ్యాటింగ్ విభాగంలో అయ్యర్ స్థానంలో ఇషాన్ కిషన్ను ఆడించే అవకాశం ఉంది. ముంబై వాంఖడేలో ఆడిన అనుభవం ఇషాన్కు ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం.
ముఖాముఖి రికార్డులో శ్రీలంకపై భారత్దే పై చేయి. ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు 167 వన్డేలు జరగ్గా 98 మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించింది. శ్రీలంక 57 వన్డేల్లో గెలిచింది. మరో 11 మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఒకటి టైగా ముగిసింది. ఇటీవల ఇరు జట్ల మధ్య జరిగిన ఐదు మ్యాచుల్లోనూ భారత్ విజయం సాధించింది. ఇందులో ఆసియా కప్ ఫైనల్లో కేవలం 50 పరుగులకే లంకను ఆలౌట్ చేసింది. సిరాజ్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగాడు.