World Cup 2023, IND vs NZ: వన్డే ప్రపంచకప్ 2023 తుది దశకు చేరుకుంది. ఆదివారం ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్తో లీగ్ దశకు తెరపడనుంది. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ చేరుకున్నాయి.
టోర్నీ రూల్స్ ప్రకారం పాయింట్స్ టేబుల్లో ఉన్న భారత్.. నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్తో తొలి సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుండగా.. 2, 3 స్థానాల్లో నిలిచిన సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు రెండో సెమీఫైనల్ ఆడనున్నాయి.

నవంబర్ 15న ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. నవంబర్ 16న కోల్కతా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా అమీతుమీ తేల్చుకోనున్నాయి. రెండు సెమీ ఫైనల్స్తో పాటు ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్డే కేటాయించారు.
మ్యాచ్ జరగాల్సిన రోజు వర్షం లేదా మరే ఇతర కారణాల వల్ల మ్యాచ్ ఆగిపోతే.. మరుసటి రోజు ఆడిస్తారు.
తొలి రోజు ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచే కొనసాగిస్తారు. మ్యాచ్ ఫలితం తేలాలంటే రిజ్వర్డేతో కలుపుకొని రెండు రోజుల్లో ఇరు జట్లు కనీసం 20 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. అప్పుడే డక్వర్త్ లూయిస్ ప్రకారం ఫలితాన్ని నిర్ణయిస్తారు. అనివార్య కారణాల ఈ రెండు రోజులు ఆట సాధ్యం కాక సెమీఫైనల్ మ్యాచ్ రద్దయితే.. ఐసీసీ ప్రపంచకప్ నిబంధనల ప్రకారం పాయింట్స్ టేబుల్లో అత్యధిక పాయింట్స్ సాధించిన జట్టు ఫైనల్కు చేరుకుంటుంది.
పాయింట్స్ సమంగా ఉంటే రన్రేట్ను పరిగణలోకి తీసుకుంటారు. ఈ రూల్ ప్రకారం తొలి సెమీఫైనల్ జరగడం సాధ్యం కాకపోతే.. భారత్ నేరుగా ఫైనల్ చేరుకుంటుంది. రెండో సెమీఫైనల్ కూడా వర్షం కారణంగా రద్దయితే.. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది.
9 మ్యాచ్లు ఆడి 7 విజయాలు సాధించిన దక్షిణాఫ్రికా 14 పాయింట్లు, +1.261 నెట్ రన్రేట్తో ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా బంగ్లాదేశ్పై గెలిస్తే 14 పాయింట్లతో లీగ్ దశను ముగించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి ఆ జట్టు నెట్ రన్ రేట్ +0.861గా ఉంది. బంగ్లాపై ఘన విజయం సాధిస్తేనే.. ఆసీస్ రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
ఫైనల్ మ్యాచ్ రద్దయితే మాత్రం ట్రోఫీని ఇరు జట్లు పంచుకోవాల్సి ఉంటుంది.