దుబాయ్: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 కోసం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కామెంటేటర్ల జాబితాను ప్రకటించింది. 31 మంది సభ్యులతో కూడి కామెంటేటర్ల వివరాలను శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ కామెంట్రీ ప్యానెల్లో భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్ దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. భారత్ నుంచి ఆరుగురికి మాత్రమే ఈసారి అవకాశం దక్కింది.
టీమిండియా దిగ్గజ క్రికెటర్లు రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్లతో పాటు దినేశ్ కార్తీక్, సంజయ్ మంజ్రేకర్, అంజుమ్ చోప్రా, హర్షా భోగ్లే వరల్డ్ కప్ వ్యాఖ్యాతల జాబితాలో అవకాశం అందుకున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు కామెంట్రీ ప్యానెల్లో అవకాశం దక్కలేదు. ఆసియాకప్ 2023 టోర్నీలో గంభీర్ కామెంటేటర్గా వ్యవహరించాడు.

ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన కామెంట్రీ ప్యానెల్లో న్యూజిలాండ్ నుంచి ఇయాన్ స్మిత్, సైమన్ డౌల్, కేటీ మార్టిన్ చోటు దక్కించుకోగా.. ఇంగ్లండ్ నుంచి ఇయాన్ మోర్గాన్, నాసర్ హుస్సేన్, మైఖేల్ ఆథర్టన్, మార్క్ నికోలస్, ఇయాన్ వర్డ్ ఉన్నారు.
పాకిస్థాన్ నుంచి రమీజ్ రాజా, వకార్ యూనీస్, అథర్ అలీ ఖాన్, వెస్టిండీస్ నుంచి ఇయాన్ బిషప్, శామ్యూల్ బద్రీ, సౌతాఫ్రికా నుంచి షాన్ పోలాక్, కస్తూరీ నాయుడు, నటాలీ జెర్మనోస్, జింబాబ్వే నుంచి ఎంపులెలో ఎంబాంగ్వా, శ్రీలంక నుంచి రసెల్ ఆర్నాల్డ్ వ్యాఖ్యాతల లిస్ట్లో చోటు దక్కించుకున్నారు.
ఈ వ్యాఖ్యతలు వామప్ మ్యాచ్ల నుంచే బాధ్యతలు స్వీకరించనున్నారు. అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండగా తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్తో భారత్ తమ ప్రపంచకప్ క్యాంపైన్ ప్రారంభించనుంది.