చెన్నై: బ్రిటన్ ఫేమస్ ప్రాంక్ స్టార్, యూట్యూబర్ జార్వో అలియాస్ డేనియెల్ జార్విస్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. వన్డే ప్రపంచకప్ 2023లో మరే మ్యాచ్కు హాజరవ్వకుండా అతనిపై నిషేధం విధించింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్కు హాజరైన జార్వో.. సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు.
టీమిండియా జెర్సీ ధరించిన జార్వో.. భారత్ తరఫున బౌలింగ్ చేస్తానంటూ రచ్చ చేశాడు. అతని ఎంట్రీతో అప్రమత్తమైన సెక్యూరిటీ జార్వో లాక్కెళ్ల ప్రయత్నం చేయగా అతను ఇబ్బంది పెట్టాడు. అతనికి విరాట్ కోహ్లీ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. జార్వో మామ కారణంగా కాసేపు మ్యాచ్కు అంతరాయం కలిగింది.

మైదానం బయటకు తీసుకెళ్లిన జార్వో.. కాసేపటికి మళ్లీ సెక్యూరిటీ కళ్లు గప్పి లోపలికి ప్రవేషించాడు. ఈసారి కేఎల్ రాహుల్ దగ్గరకు వెళ్లి ఏదో మాట్లాడే ప్రయత్నం చేయగా.. అతను బయటకు వెళ్లాలని గట్టిగా చెప్పాడు. జార్వో వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న చెపాక్ మైదాన సిబ్బంది.. చెన్నై పోలీసులకు అప్పగించారు. వారు అతన్ని మైదానం బయటకు తీసుకెళ్లారు.
పలుమార్లు మ్యాచ్కు అంతరాయం కలిగించిన జ్వారో.. ఈ ప్రపంచకప్లో మరో మ్యాచ్కు హాజరవ్వకుండా ఐసీసీ అతనిపై నిషేధం విధించింది. జ్వారో మామ ఓవరాక్షన్కు మూల్యం చెల్లించుకున్నాడని ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు.
ఇక జ్వారో ఇలా మైదానంలోకి దూసుకురావడం ఇదే తొలిసారి కాదు. రెండేళ్ల క్రితం ఇంగ్లండ్ గడ్డపై భారత్ ఆడిన ఐదు టెస్ట్ల సిరీస్లోనూ జ్వారో ఇలానే మైదానంలోకి దూసుకొచ్చాడు. వరుసగా మూడు టెస్ట్ల్లోనూ టీమిండియా జెర్సీని ధరించి బౌలింగ్ చేస్తానని.. బ్యాట్, హెల్మెట్, ప్యాడ్స్తో బరిలోకి బ్యాటింగ్ చేస్తానని రచ్చ చేశాడు.
పదే పదే మ్యాచ్లకు అంతరాయం కలిగించడంతో యార్క్షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అతనిపై నిషేధం విధించింది. ఇక భారత జట్టు అంటే తనకు ఇష్టమని జ్వారో గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఆసీస్.. భారత స్పిన్నర్ల ధాటికి 165 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా గౌరవ ప్రదమైన స్కోర్ కోసం పోరాడుతున్నారు.