న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతున్నా కొద్దీ టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్కు మద్దతు పెరుగుతోంది. ప్రపంచకప్ తుది జట్టులో సూర్యకుమార్ యాదవ్ను కచ్చితంగా ఆడించాలని మాజీ క్రికెటర్లు డిమాండ్ చేస్తున్నారు.
సూర్యకుమార్ యాదవ్ను ఫినిషర్గా ఉపయోగించుకోవాలని ఇప్పటికే మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ సూచించగా.. తాజాగా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన హర్భజన్ సింగ్.. సూర్య కోసం ఎవర్నీ పక్కనపెడతారనే విషయం తనకు అనవసరమని తెలిపాడు.

సూర్య మాత్రం ప్రతీ మ్యాచ్ ఆడాల్సిందేనని స్పష్టం చేశాడు. 'సూర్యకుమార్ యాదవ్ ప్రతీ మ్యాచ్ ఆడాల్సిందే. అతని కోసం ఎవరిని పక్కనపెడతారో నాకు అనవసరం. భారత తుది జట్టులో మాత్రం సూర్యకుమార్ యాదవ్దే తొలి పేరు ఉండాలి. అతని తర్వాతే మిగతా ఆటగాళ్లను ఎంపిక చేసుకోవాలి.
మ్యాచ్ స్వరూపాన్నే మార్చగల సత్తా అతని సొంతం. సూర్య చెలరేగితే మ్యాచ్ మొత్తం ఏకపక్షంగా మారిపోతుంది. సూర్య కంటే మెరుగైన రన్ రేట్ నమోదు చేయగల బ్యాటర్ మరొకరు జట్టులో లేరు.
హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను ఫినిషర్లుగా చూస్తాం. నా అభిప్రాయం ప్రకారం సూర్యకుమార్ యాదవ్ను ఐదో స్థానంలో ఆడించడం ఉత్తమం. 'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. వన్డేల్లో వరుసగా విఫలమవుతున్నాననే విమర్శలకు తనదైన శైలిలో బదులిచ్చాడు.
ఇక సూర్యకుమార్ యాదవ్ ఆటతీరు కూడా చాలా మారిందని, వన్డే ఫార్మాట్కు తగినట్లు ఆడుతున్నాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో టీ20ల మాదిరి తొలి బంతి నుంచి విరుచుకుపడేవాడని, కానీ ఇప్పుడూ క్రీజులో సెట్ అయ్యేందుకు టైమ్ తీసుకుంటున్నాడని వివరిస్తున్నారు.
సూర్య బ్యాటింగ్లో వైవిధ్యమైన షాట్లు ఉండటం అతనికి కలిసొచ్చే అంశమని అభిమానులు కొనియాడుతున్నారు. పిచ్తో సంబంధం లేకుండా ఏ బంతి వేసినా బౌండరీ కొట్టే సామర్థ్యం సూర్య ఒక్కడికే ఉందని కామెంట్ చేస్తున్నారు. ఆసీస్తో రెండో వన్డేలో కామెరూన్ గ్రీన్ ఓవర్లో 4 బంతుల్లో 4 సిక్స్లు బాదడమే ఇందుకు నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు.
ఒక్కో సిక్సర్ ఒక్కో రకంగా.. బ్యాక్వర్డ్ స్క్వేర్లెగ్, ఫైన్ లెగ్, ఎక్స్ట్రా కవర్, ఫార్వర్డ్ స్క్వేర్ లెగ్ వైపు పంపించాడు. అయితే సూర్య ఫామ్ అందుకోవడం టీమిండియా మేనేజ్మెంట్కు తలనొప్పిగా మారింది.