Gautam Gambhir, World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023 అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్పై టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత క్రికెట్లో వ్యక్తి పూజ ఎక్కువవ్వడంతోనే గత 10 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ రాలేదని, తాజా ప్రపంచకప్లోనూ అదే చేస్తున్నారని మండిపడ్డాడు.
టీమిండియా ప్రదర్శన కంటే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత రికార్డులను హైలైట్ చేయడాన్ని గంభీర్ తప్పుబట్టాడు. వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా 9 మ్యాచ్లకు 9 గెలిచి ఓటమెరుగని జట్టుగా లీగ్ దశను ముగించింది. ఈ 9 మ్యాచ్ల సందర్భంగా అధికారిక బ్రాడ్కాస్టర్ విరాట్ కోహ్లీ సెంచరీల రికార్డ్పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

సచిన్ అత్యధిక సెంచరీల రికార్డ్ బ్రేక్ చేస్తాడా? అనే రీతిలో స్పెషల్ ప్రోమోలు రిలీజ్ చేసింది. సూపర్ గేమ్ షోలోనూ కోహ్లీ రికార్డుల గురించే చర్చలు నిర్వహించింది. ఇది విరాట్ కోహ్లీ అభిమానులకు సంతోషాన్నిచ్చినా.. గంభీర్కు మాత్రం నచ్చడంలేదు. తాజాగా స్టార్ స్పోర్ట్స్పై అతను ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
ఒక్క ప్లేయర్ను హైలైట్ చేయడం వల్ల అద్భుత ప్రదర్శన కనబర్చిన మరో ఆటగాడికి అన్యాయం జరుగుతుందని, అతనికి రావాల్సిన గుర్తింపు దక్కడం లేదని గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ పేరు ప్రస్తావించకుండా బ్రాడ్కాస్టర్పై విమర్శలు గుప్పించాడు.
'జట్టులో ఇద్దరు హాఫ్ సెంచరీలు చేసినప్పుడు.. బ్రాడ్కాస్టర్ ఒక్కరిని మాత్రమే ఎక్కువగా చూపిస్తోంది. అతన్నే హైలైట్ చేస్తోంది. అలా చేయడం వల్ల మరో ఆటగాడు అన్యాయానికి గురవుతున్నాడు. రావాల్సిన గుర్తింపుకు నోచుకోలేకపోతున్నాడు. బ్రాడ్కాస్టర్, అభిమానులు, ఎక్స్పర్ట్స్ కలిసి ఇలా చేస్తున్నారు.
సుదీర్ఘ కాలంగా టీమిండియా ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి ఈ వ్యక్తి పూజనే కారణం. టీమ్ ప్రదర్శన కంటే వ్యక్తిగత రికార్డులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే టీమిండియా ఛాంపియన్ కాలేకపోయింది.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా బుధవారం ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్తో టీమిండియా తలపడనుంది.