IND vs AUS, WC 2023 Final: భారత క్రికెట్ అభిమానులకు మరోసారి గుండె కోతనే మిగిలింది. ప్రపంచకప్ 2023లో అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన టీమిండియా.. కీలక పోరులో మాత్రం మరోసారి తడబడింది. ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
'దరిద్రం దశావతారాలు ఎత్తితే దేవుడు కూడా ఏం చేయలేడు బ్రో..'అన్నట్లు ఈ మ్యాచ్లో టీమిండియాకు ఏది కలిసి రాలేదు. టాస్ ఓడిపోవడం నుంచి డ్యూ రావడం వరకు దురదృష్టమే వెంటాడింది. తొలుత బ్యాటింగ్కు కఠినంగా ఉన్న పిచ్.. రెండో ఇన్నింగ్స్లో మాత్రం చాలా ఈజీ అయ్యింది. భారత ఆటగాళ్లు బౌండరీలు బాదేందుకు తీవ్రంగా శ్రమించిన పిచ్పై ఆసీస్ ఆటగాళ్లు సునాయసంగా సిక్స్లు బాదారు.

క్రీజులో సెట్ అయిన బ్యాటర్లు అనూహ్యంగా దురదృష్టకర రీతిలో ఔటవ్వగా..ఆసీస్ ఆటగాళ్లకు మాత్రం చాలా అవకాశాలు లభించాయి. ఏది ఏమైనా ఈ ఓటమిని టీమిండియా ఆటగాళ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ బాధను వెళ్లగక్కుతున్నారు. మరికొందరైతే.. ఆటగాళ్లపై తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు.
ఇలా ఓడిపోయే కంటే లీగ్ దశలోనే వెనుదిరిగినా బాధపడకపోయేవాళ్లమని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం టీమిండియా పోరాటాన్ని ప్రశంసిస్తూ పోస్ట్లు పెడుతున్నారు. దురదృష్టకర రీతిలో విరాట్ కోహ్లీ ఔటవ్వకపోయింటే టీమిండియా.. ఈ మ్యాచ్లో విజయం సాధించేదని, రోహిత్ శర్మ ఔటవ్వకున్నా ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.
కీలక సమయంలో రాహుల్ ఔటవ్వకపోయినా.. టీమిండియా మరిన్ని పరుగులు చేసేదని, అప్పుడు విజయవకాశాలు మెరుగ్గా ఉండేవని కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ ఓటమి క్రికెట్ చరిత్రలో నిలిచిపోతుందని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టుకు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు కుప్పకూలింది. . విరాట్ కోహ్లీ(63 బంతుల్లో 4 ఫోర్లతో 53), కేఎల్ రాహుల్(107 బంతుల్లో ఫోర్తో 66), రోహిత్ శర్మ(31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 47)లు మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, జోష్ హజెల్ వుడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్లేన్ మ్యాక్స్వెల్, ఆడమ్ జంపా తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఆస్ట్రేలియా 43 ఓవర్లలో 4 వికెట్లకు 241 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ట్రావిస్ హెడ్(120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్లతో 137) విధ్వంసకర శతకంతో భారత్ పతనాన్ని శాసించాడు. అతనికి తోడుగా మార్నస్ లబుషేన్(110 బంతుల్లో 4 ఫోర్లతో 58 నాటౌట్) రాణించాడు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా రెండు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, సిరాజ్ ఓ వికెట్ పడగొట్టాడు.