World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా మరోసారి గుండె కోతనే మిగిలింది. అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్కు దూసుకొచ్చిన టీమిండియా.. తుదిపోరులో మాత్రం తేలిపోయింది. రోహిత్ శర్మ సూపర్ కెప్టెన్సీ.. విరాట్ కోహ్లీ సెంచరీల మోత.. మహమ్మద్ షమీ అత్యధిక వికెట్ల ప్రదర్శన.. ఏవి కూడా టీమిండియాను విశ్వ విజేతగా నిలబెట్టలేకపోయాయి.
ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన టైటిల్ ఫైట్లో సమష్టిగా విఫలమైన టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమిని 4 తప్పిదాలు శాసించాయి. టాస్ ఓడిపోవడం నుంచి ట్రావిస్ హెడ్ అసాధారణ ప్రదర్శన వరకు టీమిండియాకు అన్నీ ప్రతికూలంగానే మారాయి.

1.టాస్ ఓడిపోవడం:ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ ఓడిపోవడం ఓటమికి ప్రధాన కారణమైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆసీస్.. మందకొడిగా ఉన్న పిచ్పై చెలరేగింది. సూపర్ ఫామ్లో ఉన్న భారత బ్యాటర్లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చింది. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకొని ఉంటే.. ఆసీస్ కూడా బ్యాటింగ్లో తడబడేది. అప్పుడు టీమిండియా కలిసొచ్చేది.
2. టాపార్డర్ వైఫల్యం:ఈ ప్రపంచకప్లో సత్తా చాటిన టీమిండియా టాపర్డర్.. ఈ మ్యాచ్లో తేలిపోయింది. ముఖ్యంగా ఓపెనర్ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వైఫల్యం టీమిండియా బ్యాటింగ్ వైఫల్యాన్ని శాసించింది. ఆరంభంలోనే గిల్ వెనుదిరగ్గా.. కీలక సమయంలో చెత్త షాట్తో రోహిత్ శర్మ ఔటవ్వడం మ్యాచ్ను మలుపు తిప్పింది. ఈ ఇద్దరూ అదిరిపోయే ఆరంభం అందించి ఉంటే తర్వాతి బ్యాటర్లు స్వేచ్చగా బ్యాటింగ్ చేసేవారు.
రోహిత్ ఔటైన వెంటనే శ్రేయస్ అయ్యర్ వెనుదిరగడం కూడా భారత్ను ఒత్తిడిలోకి నెట్టేసింది. అయ్యర్ 20-30 పరుగులు చేసినా టీమిండియాకు కలిసొచ్చేది.
3. కీలక సమయంలో కోహ్లీ, రాహుల్ ఔటవ్వడం:81 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను ఆదుకున్న కోహ్లీ, రాహుల్.. చివరి వరకు ఆడకపోవడం కూడా కొంపముంచింది. హాఫ్ సెంచరీ పూర్తయిన వెంటనే కోహ్లీ దురదృష్టవశాత్తు వెనుదిరగడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా నిలిచింది. రాహుల్ సైతం హాఫ్ సెంచరీ పూర్తయిన అనంతరం ధాటిగా ఆడిన పరిస్థితుల్లో ఔటవ్వడం టీమిండియా భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుంది. ఈ ఇద్దరిలో ఒక్కరైనా చివరి వరకు ఆడి ఉంటే టీమిండియా 280-290 పరుగులు చేసేది. అప్పుడు భారత బౌలర్లకు అవకాశం ఉండేది.

4. ట్రావిస్ హెడ్ను ఔట్ చేయకపోవడం:ఐసీసీ నాకౌట్ మ్యాచ్ల్లో టీమిండియా కొరకరాని కొయ్యలా మారిన ట్రావిస్ హెడ్ను ఔట్ చేయకపోవడం ఓటమిని శాసించింది. అతనికి తగ్గ ప్రణాళికలు భారత బౌలర్ల వద్ద లేకపోవడం తీవ్ర నష్టం చేసింది. ఆరంభంలోనే ట్రావిస్ హెడ్ను ఔట్ చేసి ఉంటే 240 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా టీమిండియా కాపాడుకునేది. అతనొక్కడే అసాధారణ సెంచరీతో టీమిండియా పతనాన్ని శాసించాడు.