పుణే: వన్డే ప్రపంచకప్ 2023లో సంచలన ఫలితాల ట్రెండ్ కొనసాగుతోంది. మొన్న డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్కు అఫ్గానిస్థాన్ షాకిస్తే.. నిన్న పటిష్ట సౌతాఫ్రికాను పసికూన నెదర్లాండ్స్ మట్టికరిపించింది. ఈ రెండు పసికూన జట్లు తమ దేశ క్రికెట్ చరిత్రలోనే రికార్డు విజయాన్నందుకున్నాయి. ఈ క్రమంలోనే భారత్-బంగ్లాదేశ్ మధ్య రేపు( గురువారం) జరగనున్న మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
అఫ్గాన్, నెదర్లాండ్స్ కంటే కాస్త మెరుగైన బంగ్లాదేశ్.. భారత్ను ఓడించి ఈ సంచలనాల ట్రెండ్ కొనసాగిస్తుందా? అనే చర్చ మొదలైంది. వరుసగా హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న టీమిండియాను ఓడించడం బంగ్లాదేశ్కు స్థాయికి మించిన పనే. కానీ గత చరిత్రను చూసుకుంటే బంగ్లాదేశ్కు ఈ సంచలన ఫలితం అందుకోవడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తోంది.

గత 12 నెలలుగా వన్డే ఫార్మాట్లో భారత్.. రెండు జట్ల చేతుల్లో మాత్రమే పరాజయం పాలైంది. అందులో బంగ్లాదేశ్ ఒక జట్టు కావడం భారత అభిమానులను కలవరపాటుకు గురిచేస్తోంది. బంగ్లాదేశ్తో చివరగా ఆడిన నాలుగు వన్డేల్లో భారత్ మూడింటిలో పరాజయం పాలైంది. అయితే ఈ మూడు మ్యాచ్ల్లో టీమిండియా పూర్తి స్థాయి జట్టు దిగలేదనేది వాస్తవమే అయినా.. బంగ్లాదేశ్ విజయాన్ని తక్కువ అంచనా వేయలేం.
ఆసియా కప్ సూపర్-4లోనూ భారత్కు బంగ్లాదేశ్ షాకిచ్చింది. ఇక బంగ్లాదేశ్ కారణంగా 2007 వన్డే ప్రపంచకప్లో టీమిండియా లీగ్ దశలోనే వెనుదిరిగింది. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో భారత జట్టు 2007 వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగింది.
సౌరవ్ గంగూలీ, సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, ధోనీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, జహీర్ ఖాన్ వంటి మేటి ఆటగాళ్లున్న భారత జట్టును బంగ్లాదేశ్ 5 వికెట్లతో మట్టికరిపించి టోర్నీ నుంచి నిష్క్రమించేలా చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ భారత్.. బంగ్లా బౌలర్ల ధాటికి 191 పరుగులకే కుప్పకూలింది.

భారత జట్టులో సౌరవ్ గంగూలీ(66), యువ రాజ్ సింగ్(47) మినహా అంతా విఫలమయ్యారు. ధోనీ, భజ్జీ, అగార్కర్ డకౌటయ్యారు. అనంతరం బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసి సంచలన విజయాన్నందుకుంది. షకీబ్ అల్ హసన్(53), తమీమ్ ఇక్బాల్(51), ముష్ఫికర్ రహీమ్(56 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్ ప్రస్తుత జట్టులోనూ ఉన్నారు.
ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 40 మ్యాచ్లు జరగ్గా.. బంగ్లాదేశ్ 8 మ్యాచ్లు గెలిచింది. ఇందులో సొంతగడ్డపై రెండు ద్వైపాక్షిక సిరీస్లను సొంతం చేసుకుంది. ఈ రికార్డు నేపథ్యంలోనే బంగ్లాదేశ్ను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం.. ప్రపంచకప్లో బిగ్ టీమ్స్ అనేవి ఉండవని, అలా అనుకుంటే ఘోర పరాభావాలే ఎదురవుతాయని తెలిపాడు.