చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా తమ బ్యాటింగ్ను అత్యంత పేలవంగా ప్రారంభించింది. ఆస్ట్రేలియాతో చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్లో బౌలింగ్లో సత్తా చాటిన టీమిండియా.. బ్యాటింగ్లో మాత్రం దారుణంగా తడబడింది. 2 పరుగుల వ్యవధిలోనే టాప్-3 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్ల ధాటికి ముగ్గురు బ్యాటర్ల డకౌట్గా వెనుదిరిగారు.
మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఓపెనర్ ఇషాన్ కిషన్(0) గోల్డెన్ డక్గా వెనుదిరగ్గా.. హజెల్ వుడ్ వేసిన రెండో ఓవర్లో రోహిత్ శర్మ సైతం డకౌటయ్యాడు. ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇదే ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా చెత్త షాట్తో బ్రాంజ్ డక్గా వెనుదిరిగాడు.

కవర్స్లో డేవిడ్ వార్నర్కు ఈజీ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రత్యర్థిని 200లోపే కట్టడి చేసామనే ఆనందరం నిమిషాల్లో ఆవిరైంది. క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్తో కలిసి విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడుతున్నాడు. టాప్-3 వికెట్లను ఆరంభంలోనే కోల్పోవడంతో టీమిండియా పూర్తిగా డిఫెన్స్కే పరిమితమైంది.
భారత బ్యాటింగ్ వైఫల్యంపై అభిమానులు మండిపడుతున్నారు. వరల్డ్కప్లో ఇంత చెత్త ప్రదర్శన ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. 16 ఏళ్ల క్రికెట్ అనుభవం రోహిత్ శర్మకు నేర్పింది ఇదేనా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ తరహా బ్యాటింగ్తో ప్రపంచకప్ గెలవడం అసాధ్యమని, ఆ ఆశలు వదులుకోవాలని మండిపడుతున్నారు. అనవసర ప్రయోగాలతో రెస్ట్ పేరిట ఎంజాయ్ చేస్తూ ఆటకు దూరంగా ఉంటే ఇలాంటి ఫలితాలే ఎదురవుతాయని విమర్శలు గుప్పిస్తున్నారు. వర్షం కారణంగా రెండు వామప్ మ్యాచ్లు రద్దవ్వడం.. అంతకు ముందు ఆసీస్తో వన్డే సిరీస్కు సీనియర్ ఆటగాళ్లంతా దూరంగా ఉండటం.. టీమిండియా చేసుకున్న స్వయకృతపరాదమని మండిపడుతున్నారు.
ఈ మ్యాచ్లో గెలిచినా.. టీమిండియా నైతికంగా ఓడినట్లేనని, ఈ తరహా బ్యాటింగ్ ఏమాత్రం భావ్యం కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో మిచెల్ స్టార్క్(35 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 28) విలువైన పరుగులు జోడించాడు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/28) మూడు వికెట్లుతీయగా.. కుల్దీప్ యాదవ్(2/42), జస్ప్రీత్ బుమ్రా(2/35) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.