అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభ మ్యాచ్కు ప్రేక్షకుల నుంచి రెస్పాన్స్ కరువైంది. భారత్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీకి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తుందని భావించిన ఐసీసీ, బీసీసీఐకి గట్టి షాక్ తగిలింది. బీసీసీఐ అనాలోచిత నిర్ణయంతో ప్రేక్షకులు లేకుండా ఖాళీ మైదానంలో తొలి మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్రికెట్ అత్యున్నత టోర్నీ అయిన వన్డే ప్రపంచకప్ తొలి మ్యాచ్కు జనాలు ఎగబడుతారని భావించిన బీసీసీఐ.. వరల్డ్ బిగ్గెస్ట్ మైదానం అయిన నరేంద్రమోదీ స్టేడియంను వేదికగా ఎంపిక చేసింది. 12 ఏళ్ల తర్వాత భారత్ వేదికగా మెగా టోర్నీ జరుగుతుండటంతో ఆరంభ వేడుకలను ఘనంగా ఏర్పాటు చేయాలనుకుంది.

బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లతో అట్టహాసంగా ఆరంభ వేడుకలను నిర్వహించాలనుకుంది. ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో ఆరంభ వేడుకలపై మౌనం వహించింది. రద్దు చేస్తున్నట్లు గానీ.. తర్వాత నిర్వహిస్తామని గానీ ప్రకటించలేదు. ఎలాంటి ఆరంభ వేడుకలు లేకుండానే గురువారం వన్డే ప్రపంచకప్ 2023కి తెరలేచింది.
ఇక వామప్ మ్యాచ్లకు భారీ సంఖ్యలో హాజరైన అభిమానులు.. ప్రపంచకప్ తొలి మ్యాచ్ను లైట్ తీసుకున్నారు. లక్ష సీటింగ్ కెపాసిటీ కలిగిన మోదీ మైదానంలో పట్టుమని పదివేల మంది కూడా హాజరవ్వలేదు. దాంతో మైదానమంతా బోసిపోయి కనిపించింది. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిస్తూ బీసీసీఐని వెక్కిరించాయి.
ప్రస్తుతం ఖాళీ కుర్చీలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. బీసీసీఐపై ప్రపంచవ్యాప్తంగా ట్రోలింగ్ జరుగుతోంది. ప్రపంచకప్ ఆరంభం మ్యాచ్కు ఆదరణ కరువైందని నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు. వర్కింగ్ డే కావడంతోనే జనాలు పెద్దగా రాలేదని అర్థమవుతోంది. మెగా టోర్నీ ఆరంభాన్ని వీకెండ్లో ప్లాన్ చేయకపోవడమే ఈ దుస్థితికి కారణమని ప్రచారం జరుగుతోంది.
సాయంత్రానికల్లా ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుందని వీరేంద్ర సెహ్వాగ్ వంటి మాజీ క్రికెటర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. ఆరంభ వేడుకలను ఏర్పాటు చేసినా జనాలు వచ్చేవారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏది ఏమైనా వన్డే ప్రపంచకప్ ఆరంభం అట్టర్ ఫ్లాఫ్ అయ్యింది.
న్యూజిలాండ్తో జరుగుతున్న ఈ తొలి మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. జోరూట్(86 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 77) హాఫ్ సెంచరీతో రాణించగా.. కెప్టెన్ జోస్ బట్లర్(42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 43) పర్వాలేదనిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు వికెట్లకు తీయగా.. మిచెల్ సాంట్నర్, గ్లేన్ ఫిలిప్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ట్రెంట్ బౌల్డ్, రచిన్ రవీంద్రకు తలో వికెట్ దక్కింది.