హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి భారత సెలెక్షన్ కమిటీ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించాడు. రోహిత్ శర్మతో కలిసి మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్న అగార్కర్.. ఆసియాకప్ 2023 టోర్నీకి ఎంపిక చేసిన జట్టునే దాదాపు కొనసాగించామని తెలిపాడు. ఆసియాకప్ టీమ్ నుంచి ఇద్దరు ఆటగాళ్లకే మాత్రం ఉద్వాసన పలికామని స్పష్టం చేశాడు.
అందరూ ఊహించినట్లుగా పేసర్ ప్రసిధ్ కృష్ణతో పాటు తెలుగు తేజం తిలక్ వర్మకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్తో పాటు మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ట్నెస్ సమస్యలతో బాధపడుతున్న రాహుల్ను పక్కనపెడతారని ప్రచారం జరిగినా.. సెలెక్టర్లు అతన్నే కొనసాగించారు.

సీనియర్ స్పిన్నర్లు యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ల పేర్లను పరిశీలిస్తారని ప్రచారం జరిగినా.. సెలెక్టర్లు పట్టించుకోలేదు. అయితే టీమ్ ఎంపికపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు జట్టు బాగుందని ప్రశంసిస్తే మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
హర్భజన్ సింగ్ వంటి దిగ్గజ స్పిన్నర్.. యుజ్వేంద్ర చాహల్ను తీసుకోకపోవడాన్ని తప్పుబట్టాడు. టీమిండియా ఓ మ్యాచ్ విన్నర్ను పక్కనపెట్టిందని ట్వీట్ చేశాడు. ఇంకొందరు కేఎల్ రాహుల్ ఎంపికను తప్పుబడుతున్నారు. ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా బిగ్ మ్యాచ్ల ఒత్తిడిని రాహుల్ తట్టుకోలేడని గుర్తు చేస్తున్నారు.
క్లాస్ ప్లేయర్ అయిన రాహుల్.. కీలక మ్యాచ్ల్లో రాణించలేడని గణంకాలతో సహా గుర్తు చేస్తున్నారు. అతని కారణంగా టీమిండియా మూడు ప్రపంచకప్ టోర్నీలతో పాటు 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో విఫలమైందని గుర్తు చేస్తున్నారు. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడే కేఎల్ రాహుల్ ఒత్తిడిని అధిగమించలేడని చెప్పాడని కామెంట్ చేస్తున్నారు.

ఏమాత్రం ఫామ్లో లేని రాహుల్ కోసం సూపర్ ఫామ్లో ఉన్న లెఫ్టార్మ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను పక్కనపెట్టాల్సి వస్తుందని, ఇది జట్టుకు నష్టం చేస్తుందని చెబుతున్నారు. రాహుల్ రాకతో జట్టులో లెఫ్టార్మ్ బ్యాటర్ లేకుండా పోతాడని హెచ్చరిస్తున్నారు. ఇంకొందరు ఎంతో అనుభవం కలిగిన రవిచంద్రన్ అశ్విన్ తీసుకోవాల్సిందని, అతనికి బ్యాటింగ్ చేసే సామర్థ్యం కూడా ఉందని అభిప్రాయపడుతున్నారు.
భారత ప్రపంచకప్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్.