World Cup 2023, IND vs NED: వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా దుమ్మురేపుతోంది. 9 మ్యాచ్లకు 9 గెలిచి లీగ్ దశను ఘనంగా ముగించిన టీమిండియా ఓటమెరుగని జట్టుగా సెమీస్ చేరింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా నెదర్లాండ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 160 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
దాంతో ఈ ఏడాది అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా చరిత్రకెక్కింది. అయితే ఈ మ్యాచ్కు సంబంధించిన ఆసక్తికర విషయం అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. మెగాటోర్నీలో 9 విజయాలు సాధించిన టీమిండియా.. నెదర్లాండ్స్తో మ్యాచ్లో 9 మందితో బౌలింగ్ చేయించింది. ఇక 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డేల్లో వికెట్ సాధించగా.. 4284 రోజుల తర్వాత బౌలింగ్ చేసిన రోహిత్ శర్మ 9వ వన్డే వికెట్ను ఖాతాలో వేసుకున్నాడు.

వరుసగా 9 విజయాలతో 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ ఫీట్ సాధించిన మూడో కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. టీమిండియాకు సంబంధించిన అన్నీ విషయాలు 9తో ముడిపడి ఉండటం ప్రత్యేకం. ఇది ఆసక్తికర అంశమని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 410 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్(94 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్లతో 128 నాటౌట్), కేఎల్ రాహుల్(64 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్లతో 102) విధ్వంసకర శతకాలతో చెలరేగగా.. రోహిత్ శర్మ(54 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 61), శుభ్మన్ గిల్(32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 51), విరాట్ కోహ్లీ(56 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 51) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు.

నెదర్లాండ్స్ బౌలర్లలో బాస్ డీ లీడే రెండు వికెట్లు తీయగా.. పాల్ వాన్ మెకెరెన్, వాన్ డెర్ మెర్వే తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్స్ 47.5 ఓవర్లలో 250 పరుగులకు కుప్పకూలింది. తెలుగు తేజం తేజ నిడమనూరు(39 బంతుల్లో ఫోర్, 6 సిక్స్లతో 54) హాఫ్ సెంచరీ రాణించగా.. సైబ్రాండ్(80 బంతుల్లో 4 ఫోర్లతో 45), కోలిన్ అకెర్మన్(32 బంతుల్లో 6 ఫోర్లతో 35) పర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా రెండేసి వికెట్లు తీయగా.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చెరొక వికెట్ దక్కింది. విధ్వంసకర శతకంతో టీమిండియాకు భారీ స్కోర్ అందించిన శ్రేయస్ అయ్యర్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.