అహ్మదాబాద్: ఇంగ్లండ్ క్రికెట్ టీమ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే మరే జట్టు సాధించని అరుదైన ఫీట్ సొంతం చేసుకుంది. వన్డే క్రికెట్ చరిత్రలోనే జట్టులోని 11 మంది ఆటగాళ్లకు 11 మంది 10 ప్లస్ రన్స్ చేసిన ఘనతను అందుకుంది. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్తో తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ ఈ ఫీట్ సాధించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 282 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్కు చెందిన 11 మంది బ్యాటింగ్ చేయగా.. 11 మంది 10 ప్లస్ రన్స్ చేశారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే ఓ జట్టుకు చెందిన 11 మంది ఆటగాళ్లు 10 ప్లస్ రన్స్ చేయడం ఇదే ప్రథమం. ఈ ఘనతను అందుకున్న జట్టుగా ఇంగ్లండ్ చరిత్రకెక్కింది.

ఇంగ్లండ్ బ్యాటర్లలో జోరూట్(86 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 77) టాప్ స్కోరర్గా నిలవగా.. మొయిన్ అలీ(11), క్రిస్ వోక్స్(11) లోయెస్ట్ స్కోర్ నమోదు చేశారు. ఇతర బ్యాటర్లలో జానీ బెయిర్ స్టో(33), డేవిడ్ మలాన్(14), హ్యారీ బ్రూక్(25), జోస్ బట్లర్(43), లియామ్ లివింగ్ స్టోన్(20), సామ్ కరణ్(14), ఆదిల్ రషీద్(15 నాటౌట్), మార్క్ వుడ్(13 నాటౌట్) రెండెంకల స్కోర్ నమోదు చేశారు.
ఇంగ్లండ్ బజ్బాల్ వ్యూహం బెడిసికొట్టడంతో సాధారణ స్కోర్కే పరిమితమైంది. ధాటిగా ఆడాలనే ఆతృతలో ఇంగ్లండ్ బ్యాటర్లు అనవసర షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ(3/48) తీన్మార్ బౌలింగ్కు మిచెల్ సాంట్నర్(2/37), గ్లేన్ ఫిలిప్స్(2/17) దోబార్ బౌలింగ్ తోడవ్వడంతో ఇంగ్లండ్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ట్రెంట్ బౌల్డ్, రచిన్ రవీంద్రకు చెరో వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ఓపెనర్ విల్ యంగ్(0) గోల్డెన్ డక్ అయినా.. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే, ఫస్ట్ డౌన్ బ్యాటర్ రచిన్ రవీంద్ర అద్భుతంగా ఆడుతున్నారు. ఈ ఇద్దరి ధాటికి న్యూజిలాండ్ పవర్ ప్లేలోనే వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది. ఇద్దరూ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటికే వీరి భాగస్వామ్యం 153 పరుగులు ధాటింది.