ముంబై: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్కు రెండు వారాలే సమయం ఉండగా.. టీమింయా జెర్సీని బీసీసీఐ ఆవిష్కరించింది. గతంలో మాదిరే నీలి రంగులో, కొత్త సొబగులతో జెర్సీని తీర్చిదిద్దారు. జెర్సీ ఆవిష్కరణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన '3 కా డ్రీమ్ హై అప్నా' అనే థీమ్ సాంగ్ను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
టీమిండియా ప్రపంచకప్ జెర్సీని కిట్ స్పాన్సర్ అడిడాస్ రూపొందించింది. టీమిండియా కిట్ స్పాన్సర్గా అడిడాస్ ఇటీవల నియామకమైన విషయం తెలిసిందే. అడిడాస్ వచ్చాక భారత పురుషుల జట్టుతో పాటు మహిళల జట్ల జెర్సీలను మార్చింది. టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లకు వేర్వేరు జెర్సీలను తీసుకొచ్చింది.

టీ20ల్లో కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్ జెర్సీ, వన్డేల్లో కాలర్తో లైట్ బ్లూ కలర్ జెర్సీ, టెస్టుల్లో వైట్ కలర్ జెర్సీలను అడిడాస్ ప్రవేశపెట్టింది. ఆయా జెర్సీలపై కుడివైపు అడిడాస్ లోగోతో పాటు ఎడమవైపు బీసీసీఐ టీమ్ లోగోను ఉంచింది. వాటితో పాటు మూడు నక్షత్రాలు, మధ్యలో లీడ్ స్పాన్సర్ డ్రీమ్ 11 పేరుతో పాటు ఇండియా అని రాసి ఉంటుంది.
వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని జెర్సీలో స్వల్ప మార్పులు చేశారు. కొత్త జెర్సీపై ఎడమ వైపు అశోక చక్రంపై రెండు నక్షత్రాలు మాత్రమే ఉన్నాయి. టీమిండియా ఇప్పటివరకు రెండు ప్రపంచకప్లు గెలిచినందున రెండు స్టార్లనే ఉంచారు. మామూలు జెర్సీపై టీ20 ప్రపంచకప్తో కలిపి మూడు నక్షత్రాలు ఉంటాయి.
భుజాలపై ఉన్న మూడు అడ్డ గీతలపై తెలుపు రంగు స్థానంలో తివర్ణ పతాకంలోని మూడు రంగులు (కాషాయం, తెలుపు, ఆకుపచ్చ) ఉన్నాయి. 1983, 2011లో ప్రపంచకప్ సాధించిన భారత్.. మూడోసారి కప్పు అందుకోవాలన్న అభిమానుల ఆకాంక్షలను ప్రతిబింబించేలా థీమ్ సాంగ్ను రూపొందించారు. ప్రముఖ రాపర్ రాఫ్టార్ ఈ పాటను ఆలపించాడు.
అక్టోబర్ 5 నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే తొలి మ్యాచ్తో టీమిండియా తమ ప్రపంచకప్ క్యాంపైన్ను ప్రారంభించనుంది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్-పాకిస్థాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.
ప్రపంచకప్ కోసం ఐసీసీ రూపొందించిన థీమ్ సాంగ్లో యుజ్వేంద్ర చాహల్ సతీమణి ధనశ్రీ వర్మ మెరిసింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సాంగ్ను ప్రీతమ్ రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్రపంచకప్ జట్టులో చాహల్కు చోటు దక్కకున్నా.. అతని పెళ్లానికి అవకాశం దక్కిందని నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు.