World Cup 2023: భారత మహిళా జర్నలిస్ట్.. ది వైర్ సీనియర్ ఎడిటర్ అర్ఫా ఖనుమ్ షెర్వాణీపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మండిపడ్డాడు. భారతీయురాలిగా ఉండేందుకు సిగ్గుపడితే పాకిస్థాన్కు వచ్చేయాలని సూచించాడు. వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో భారత అభిమానుల ప్రవర్తనను తప్పుబడుతూ ఖనుమ్ షెర్వాణీ ట్వీట్ చేయగా.. డానిష్ కనేరియా ఘాటుగా స్పందించాడు.
'ప్రపంచకప్ మ్యాచ్ల సందర్భంగా భారత అభిమానులు హద్దులు ధాటి ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన భారతీయురాలైన నాకే ఇబ్బందిగా, సిగ్గుగా అనిపిస్తోంది. ప్రజలను ఏకతాటి పైకి తీసుకురావడానికి తీసుకొచ్చే క్రీడలను కూడా మోదీ-ఆర్ఎస్ఎస్ విధానం నాశనం చేసింది.'అని ఖనుమ్ షెర్వాణీ ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్పై డానిష్ కనేరియా ఘాటుగా స్పందించాడు. 'భారతీయురాలిగా సిగ్గుపడితే మా దేశం పాకిస్థాన్కు వచ్చేయండి. మీలాంటి వారికి భారత్లో చోటు లేదు. ప్రపంచకప్ను భారత్లో చాలా మంది ప్రజలు ఆస్వాదిస్తున్నారని కచ్చితంగా చెప్పగలను.'అని డానిష్ కనేరియా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ కాగా.. కనేరియాకు భారత అభిమానులు మద్దతు తెలుపుతున్నారు.
హిందువైన కనేరియా పాకిస్థాన్ తరఫున 61 టెస్ట్లు, 18 వన్డేలు ఆడాడు. తాజాగా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఫొటోలను కూడా కనేరియా ట్వీటర్ వేదికగా పంచుకున్నాడు. ఈ ఫొటోలను చూసి అవాక్కైన నెటిజన్లు.. పాకిస్థాన్లో ఇది ఎక్కడా? అని ప్రశ్నిస్తున్నారు. అక్కడ నవరాత్రి ఉత్సవాలు కూడా జరుపుతారా? అని అడుగుతున్నారు. దేశ విభజన సమయంలో కొందరు హిందవులు అక్కడే ఉండిపోయారు.
అలా ఉండిపోయిన కుటుంబాల్లో కనేరియా ఫ్యామిలీ ఒకటి. భారత్పై అతను ప్రేమ చూపించడం ఇదే తొలిసారి కాదు. భారత ప్రధాని నరేంద్ర మోదీని కనేరియా విపరీతంగా అభిమానిస్తాడు. ఆయన పుట్టినరోజుకు విషెస్ కూడా తెలియజేశాడు. ఈ క్రమంలో కనేరియా సొంత అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు.
డానిష్ కనేరియా 2000 సంవత్సరం నవంబర్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. పాక్ తరపున 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు. 2009లో ఇంగ్లీష్ కౌంటీ చాంపియన్షిప్ ప్రో లీగ్లో భాగంగా కనేరియా స్పాట్ ఫిక్సింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఫిక్సింగ్ ఆరోపణలు నిజమని తేలడంతో 2012లో ఇంగ్లీష్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు అతనిపై జీవితకాల నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని పీసీబీ కూడా సమర్థించింది. అప్పటి నుంచి అతనిపై నిషేధం కొనసాగుతుండగా.. ఎత్తేయాలని ఎంత మొరపెట్టుకున్నా పీసీబీ కనికరించడం లేదు.