న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్లకు భద్రతాపరమైన సమస్యలు తలెత్తుతాయని రీషెడ్యూల్ చేయాలని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) చేసిన విజ్ఞప్తిని బీసీసీఐ పట్టించుకోలేదు. ప్రస్తుతం రీషెడ్యూల్ చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది.
వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్ - నెదర్లాండ్స్ మ్యాచ్ అక్టోబర్ 9న జరగనుండగా.. పాకిస్థాన్ - శ్రీలంక మ్యాచ్ ఆ మరుసటి రోజునే (అక్టోబర్ 10న) ఉంది. వరుసగా జరిగే ఈ మ్యాచ్లకు భద్రత కల్పించడం కష్టమవుతుందని హైదరాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ అధికారుల సూచనల మేరకు మ్యాచ్ను రీషెడ్యూల్ చేయాలని హెచ్సీఏ బీసీసీఐని కోరింది.

ఈ విజ్ఞప్తిపై స్పందించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఇప్పుడు ఎలాంటి మార్పులు చేయలేమని స్పష్టం చేశారు. గత జూన్లో తొలి షెడ్యూల్ను ప్రకటించిన ఐసీసీ, బీసీసీఐ.. ఆ తర్వాత వివిధ దేశాలు, క్రికెట్ అసోసియేషన్ల విజ్ఞప్తుల మేరకు తొమ్మిది మ్యాచ్లను రీషెడ్యూల్ చేసింది. ఇప్పుడు మరోసారి హెచ్సీఏ విజ్ఞప్తి చేసినా రీషెడ్యూల్కు కుదరదని రాజీవ్ శుక్లా తెలిపారు.
'ప్రపంచకప్ మ్యాచ్లు జరగనున్న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం ఇన్ఛార్జ్గా ఉన్నా. ఏదైనా సమస్య ఉంటే తప్పకుండా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తా. అయితే, వరల్డ్ కప్ మ్యాచ్ షెడ్యూల్ను మార్చడం అంత సులువైన పని కాదు. కేవలం బీసీసీఐ మాత్రమే షెడ్యూల్ను మార్చలేదు. మిగతా జట్లు, ఐసీసీ. క్రికెట్ అసోసియేషన్లు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.' అని రాజీవ్ శుక్లా చెప్పుకొచ్చారు.
పాకిస్థాన్ మ్యాచ్ కావడంతో భద్రత మరింత కట్టుదిట్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే హైదరాబాద్ పోలీస్, క్రికెట్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ వేదికగానే పాకిస్థాన్ రెండు మ్యాచ్లు ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్తో, అక్టోబర్ 10న శ్రీలంకతో తలపడనుంది. అలాగే రెండు వార్మప్ మ్యాచ్లను కూడా ఉప్పల్ వేదికగానే పాకిస్థాన్ ఆడనుంది.