న్యూఢిల్లీ: సౌతిండియా సూపర్ స్టార్, తమిళ తలైవా రజనీకాంత్కు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) వన్డే ప్రపంచకప్కు సంబంధించిన గోల్డెన్ టికెట్ను అందజేసింది. బీసీసీఐ సెక్రటరీ జై షా స్వయంగా ఈ గొల్డెన్ టికెట్ను రజనీకాంత్కు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
'సూపర్ స్టార్ రజనీకాంత్కు బీసీసీఐ సెక్రటరీ జైషా గోల్డెన్ టికెట్ అందజేశారు. భాషా, సంస్కృతికి అతీతంగా తన నటనతో కోట్లాది మంది హృదయాల్లో చెరగని ముద్ర వేసిన తలైవాను మా విశిష్ట అతిథిగా వన్డే ప్రపంచకప్కు ఆహ్వానిస్తున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి మెగా టోర్నీకి హాజరవుతారని, క్రికెట్ అభిమానులను మరింత అలరిస్తారని ఆశిస్తున్నాం.'అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

రజనీకాంత్ కన్నా ముందు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్లకు కూడా బీసీసీఐ గోల్డెన్ టికెట్ అందజేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న జరిగే తొలి మ్యాచ్తో టీమిండియా ప్రపంచకప్ క్యాంపైన్ను ప్రారంభించనుంది.
అక్టోబర్ 14న పాకిస్థాన్తో అహ్మదాబాద్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇటీవలే ముగిసిన ఆసియాకప్ 2023 టైటిల్ గెలిచిన టీమిండియా ఫుల్ జోష్లో ఉంది. వన్డే ప్రపంచకప్ ముంగిట పటిష్ట ఆస్ట్రేలియాతో సొంతగడ్డపై మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సెలెక్షన్ కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
ఆసియాకప్లో భాగంగా బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడిన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను తొలి రెండు వన్డేలకు పక్కనపెట్టారు. అతని స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను జట్టులోకి తీసుకున్నారు. తెలుగు తేజం తిలక్ వర్మకు మరోసారి అవకాశమిచ్చారు. తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతినిచ్చారు.
రజనీకాంత్ నటించిన జైలర్ మూవీ ఇటీవలే విడుదలై బాక్సాఫిస్ను షేక్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 650 కోట్ల గ్రాస్ రాబట్టింది. రూ. 600 కోట్లు ధాటిన రెండో తమిళన చిత్రంగా నిలిచింది.