BCCI bans Fireworks: వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీ తుది దశకు చేరుకుంటున్న క్రమంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై, ఢిల్లీ స్టేడియంలో బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. పర్యవరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని, దీపావళి నేపథ్యంలో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని భావించి బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
ప్రతీ మ్యాచ్ అనంతరం స్టేడియంలో కళ్లు మెరుమెట్లు గొలిపేలా బాణసంచా కాలుస్తూ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నారు. ముంబై, ఢిల్లీలో జరిగే మ్యాచ్ల్లో బాణసంచా పేల్చడం లేదని బీసీసీఐ సెక్రటరీ జై షా ప్రకటించారు.

టీమిండియా తన తదుపరి మ్యాచ్ను గురువారం ముంబైలోని వాంఖడే వేదికగా ఆడనుంది. అయితే ముంబైలోని వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని తాము బాణసంచా కాల్చడం లేదని జై షా వెల్లడించారు. ఇప్పటికే ముంబైలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అక్కడ రోజురోజుకు పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ పరిస్థితుల్లో బాణసంచా కాల్చితే వాయు కాలుష్యం మరింత పెరుగుతుందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని జై షా వివరణ ఇచ్చారు. మరోవైపు ఢిల్లీలో జరిగే మ్యాచ్లోనూ ఫైర్ వర్క్స్ ఉండవని స్పష్టం చేశారు. ఢిల్లీలో కూడా వాయు కాలుష్యం భారీ స్థాయిలో ఉండటం వల్ల తాము బాణసంచా కాల్చే కార్యక్రమాన్ని పక్కనపెట్టామని స్పష్టం చేశారు.
అభిమానులు, ఆటగాళ్లు, ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని.. అందులో భాగంగానే ఫైర్ వర్క్స్ ఉపయోగించవద్దని నిర్ణయం తీసుకున్నామని జై షా వెల్లడించారు. మెగా టోర్నీలో వరుస విజయాలతో జోరు మీదున్న టీమిండియా.. తుదపరి మ్యాచ్లో శ్రీలంకతో తలపడనుంది. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి సెమీస్ బెర్త్ను ఖరారు చేసుకోవాలని భావిస్తోంది.