పుణె: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. చాలా ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఉదంతంపై యావత్ క్రికెట్ ప్రపంచం మండిపడుతోంది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.
ఈ విజయం నేపథ్యంలో స్టేడియంలో భారత అభిమానులు రెచ్చిపోయారు. బంగ్లాదేశ్ అభిమానులను గేలి చేస్తూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో చాలా ఆలస్యంగా వెలుగు చూసింది. సచిన్ టెండూల్కర్ వీరాభిమాని సుదీర్ గౌతమ్ తరహాలో.. ఓ బంగ్లాదేశ్ డైహార్డ్ ఫ్యాన్ షోయబ్ అలీ ఈ మ్యాచ్కు హాజరయ్యాడు. అందరూ అతన్నీ టైగర్ షోయబ్ అని ముద్దుగా పిలుస్తారు.

బంగ్లాదేశ్ ఐకాన్ అయిన పులి వేషదారణలో హాజరైన షోయబ్.. మ్యాచ్కు టైగర్ మస్కట్ పట్టుకొచ్చి తమ జట్టుకు మద్దతు తెలిపాడు. భారత విజయానంతరం కొందరు ఇండియన్ ఫ్యాన్స్.. సదరు బంగ్లా వీరాభిమానిపై దాడి చేశారు. అతని చేతిలో ఉన్న పులి మస్కట్ను లాక్కొని.. చించి పడేసారు. బంగ్లాదేశ్ను చిత్తు చేసామనే ఉద్దేశంతో ఇలా పులి బొమ్మను విచ్చిన్నం చేశారు.
ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచంలో ఇతర దేశాల అభిమానులకు తగిన గౌరవం లభించడం లేదని, భద్రత కూడా లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరు భారత నెటిజన్లు మాత్రం ఈ ఘటనను సమర్థిస్తున్నారు. బంగ్లా అభిమానుల ఓవరాక్షన్ ముందు ఈ ఘటన చాలా చిన్నదని కామెంట్ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ పర్యటనలో సచిన్ డైహార్డ్ ఫ్యాన్ సుదీర్ గౌతమ్పై బంగ్లా అభిమానులు దాడి చేశారని, అతన్ని గాయపర్చారని గుర్తు చేశారు. అంతేకాకుండా భారత ఆటగాళ్లకు గుండ్లు కొట్టి పోస్టర్లు, తల నరికి చేతుల్లో పట్టుకున్న ప్లకార్డులతో తీవ్రంగా అవమానించారని, వాటి కంటే తాజా ఘటన చాలా చిన్నదని సమర్థిస్తున్నారు.
ఇక ఆస్ట్రేలియా-పాకిస్థాన్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లోనూ 'పాకిస్థాన్ జిందాబాద్'అనే నినాదాలు చేయవద్దని అక్కడి పోలీస్ అధికారి అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. ఈ వీడియో కూడా వైరల్ కావడంతో బీసీసీఐ, టోర్నీ నిర్వాహకులపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.