Babar Azam, World Cup 2023: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వన్డే ప్రపంచకప్ 2023లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీకి గుడ్బై చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.
'ఈ నిర్ణయం కఠినమైనదైనా.. ఇదే సరైన సమయమని భావిస్తున్నా. మూడు ఫార్మాట్లలో ఓ ఆటగాడిగా పాకిస్థాన్కు ప్రాతినిథ్యం వహిస్తాను. నా అనుభవం, అంకితభావంతో కొత్త కెప్టెన్కు జట్టుకు సహాయ సహాకారాలు అందిస్తాను'అని బాబర్ ఆజామ్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. కెప్టెన్గా తనకు బాధ్యతలు అప్పగించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు బాబర్ ఆజామ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు.

భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్లో పాకిస్థాన్ సెమీస్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. అఫ్గానిస్థాన్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 9 మ్యాచ్లకు నాలుగు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో ఐదో స్థానంలో నిలిచింది. పేలవ బౌలింగ్, చెత్త ఫీల్డింగ్ ఆ జట్టు పతనాన్ని శాసించింది. జట్టులోని ఆటగాళ్ల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు సైతం టీమ్ పెర్ఫామెన్స్పై ప్రభావం చూపాయి.
ప్రపంచకప్ వైఫల్యంతో బాబర్ ఆజామ్పై సర్వత్రా విమర్శలు వక్తమయ్యాయి. బాబర్ ఆజామ్ను కెప్టెన్సీ నుంచి తప్పించాలనే డిమాండ్ వచ్చింది. ఈ క్రమంలోనే బాబర్ ఆజామ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి గౌరవంగా తప్పుకున్నాడు.
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తరహాలోనే బాబర్ ఆజామ్ మూడు ఫార్మాట్లకు గుడ్బై చెప్పాడు. 2021 టీ20 ప్రపంచకప్ ఘోర వైఫల్యం అనంతరం కోహ్లీ సైతం ఇదే తరహా పరిస్థితి ఎదుర్కొన్నాడు. వన్డేల నుంచి కోహ్లీని సారథిగా తప్పించడంతో మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ వీడ్కోలు పలికాడు. ఆటగాడిగా.. పాత కోహ్లీలా చెలరేగుతున్నాడు.
బాబర్ ఆజామ్ కూడా తన బ్యాటింగ్పై ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యాడు. కొత్త కెప్టెన్గా ఎవరు వచ్చినా అతనికి పూర్తి సహకారం అందిస్తానని స్పష్టం చేశాడు.