అహ్మదాబాద్: వన్డే ప్రపంచకప్ 2023 కోసం తొలిసారి భారత్కు వచ్చిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్.. బీసీసీఐ ఆతిథ్యానికి ఫిదా అయ్యాడు. భారత్లో ఇలాంటి ఆతిథ్యం ఉంటుందని అస్సలు ఊహించలేదని తెలిపాడు. తమ ఇంట్లో ఉన్న ఫీలింగే కలుగుతుందని చెప్పాడు. వన్డే ప్రపంచకప్కు గురువారం తెరలేవనుండగా.. బుధవారం అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా కెప్టెన్ డే నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి 10 జట్ల కెప్టెన్లు హాజరై వన్డే ప్రపంచకప్ ట్రోఫీతో ఫొటోలకు ఫోజిచ్చారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే భారత ఆతిథ్యంపై బాబర్ ఆజామ్ను ప్రశ్నించగా.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'భారత్ ఆతిథ్యం అద్భుతం. ఇలాంటి ఆతిథ్యం లభిస్తుందని అస్సలు ఊహించలేదు. బీసీసీఐ కల్పించిన సౌకర్యాల నేపథ్యంలో మా ఇంట్లో ఉన్న ఫీలింగే కలుగుతోంది. ఇక్కడికి వచ్చే ముందు భారత్లో మాకు ఎలాంటి మద్దతు లభించదని, అభిమానులు ఎవరూ మాకు అండగా నిలవరనే మాటలు విన్నాను. కానీ మాకు అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
మేం ఎయిర్ పోర్ట్లో దిగినప్పటి నుంచి హోటల్, మైదానం వెళ్లే వరకు అభిమానులు మాకు చీర్ చేస్తూ స్వాగతం పలికారు. మేమంతా బస్సుల్లో వెళ్తుంటే కొందరు అభిమానులు మమ్మల్ని అనుసరించారు. ఈ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్లో మేం రెండు వామప్ మ్యాచ్లు ఆడాం. అక్కడి ప్రజలకు మాకు అండగా నిలిచారు. హైదరాబాద్ బిర్యానీ కమ్మగా ఉంది.'అని బాబర్ ఆజామ్ చెప్పుకొచ్చాడు. గురువారం నుంచి మెగా టోర్నీ ప్రారంభం కానుండగా.. అహ్మదాబాద్ వేదికగా జరిగే తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. శుక్రవారం హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్.. నెదర్లాండ్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది.
అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్తో పాకిస్థాన్ తలపడనుంది. హైదరాబాద్ వేదికగా జరిగిన రెండు వామప్ మ్యాచ్ల్లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. గాయంతో నసీమ్ షా దూరమవ్వడం, హ్యారీస్ రౌఫ్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతుండటం ఆ జట్టుకు సమస్యగా మారింది. ఇక వికెట్లు తీసే స్పిన్నర్లు కూడా లేకపోవడం ఆ జట్టుకు నష్టం చేసే అంశం.