కొలంబో: ఆసియాకప్ 2023 ఫైనల్ చేరకుండా ఇంటిదారి పట్టిన పాకిస్థాన్ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలింది. శ్రీలంకతో ఊహించని ఓటమితో తీవ్ర బాధలో ఉన్న ఆ జట్టుకు దెబ్బ మీద దెబ్బ పడింది. భుజ గాయంతో ఆసియాకప్ 2023 నుంచి అర్థాంతరంగా వైదొలిగిన నసీమ్ షా.. వన్డే ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్లకు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా భారత్తో జరగనున్న మ్యాచ్లో నసీమ్ షా ఆడనుండటంపై సందేహాలు నెలకొన్నాయి. భుజ గాయంతో బాధపడుతున్న నసీమ్ షా.. వచ్చే నెలలో తన ఆటను ప్రారంభించనున్నాడని పీసీబీ వర్గాలు పేర్కొన్నాయి. అప్పటి వరకు రెస్ట్లోనే ఉంటాడని స్పష్టం చేశాయి.

పక్కటెముకల గాయంతో బాధపడుతున్న హ్యారీస్ రౌఫ్ మాత్రం ప్రపంచకప్ ప్రారంభ మ్యాచ్ల నుంచే అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడని సమాచారం. నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ గైర్హాజరీలతో పాకిస్థాన్ పూర్తిగా బలహీనంగా కనిపిస్తోంది.
శ్రీలంకతో ఆఖరి బంతికి ఓడిన పాకిస్థాన్.. ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానం కోల్పోవడంతో పాటు మూడో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా.. భారత్ రెండో స్థానంలో కొనసాగుతోంది. టాప్-3 టీమ్స్ మధ్య రేటింగ్ పాయింట్స్ తేడా చాలా స్వల్పంగా ఉంది. 118 పాయింట్లతో ఆసీస్ టాప్లో ఉండగా.. భారత్ 116, పాకిస్థాన్ 115 పాయింట్లతో వరుసగా కొనసాగుతున్నాయి.
ఆసియాకప్ 2023లో భారత్ విజేతగా నిలవడంతో పాటు సౌతాఫ్రికా పర్యటనలో ఆసీస్ ఓడితే టీమిండియాకు నెంబర్ వన్ ర్యాంక్ దక్కనుంది. నెంబర్ వన్ ర్యాంక్ సాధిస్తే ఒకేసారి మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ ర్యాంక్ అందుకున్న జట్టుగా గుర్తింపు పొందనుంది. శ్రీలంకపై ఓడిన పాకిస్థాన్ ఆసియా కప్ నుంచి నిష్క్రమించింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్, శ్రీలంక అమీతుమీ తేల్చుకోనున్నాయి.