హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ కోసం దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టింది. బుధవారం రాత్రి 10 గంటలకు హైదరాబాద్లోని శంషాబాద్ విమానశ్రయానికి చేరుకుంది. పాకిస్థాన్ జట్టుకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఘన స్వాగతం పలికింది. పాక్ ఆటగాళ్లను చూసేందుకు నగర అభిమానులు కూడా ఆసక్తి చూపించారు. వారికి ఘన స్వాగతం పలికారు.
రాజీవ్గాంధీ విమానాశ్రయం నుంచి బస చేసే పార్క్ హయత్ హోటల్కు చేరుకునేంత వరకూ పాకిస్థాన్ జట్టుకు హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆటగాళ్ల సెక్యూరిటీ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు రెండు అంచెల భద్రత ఏర్పాటు చేశారు.

ఏడేళ్ల తర్వాత భారత గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ ఆటగాళ్లకు ఊహించని స్వాగతం లభించడంపై ఆ జట్టు ఆటగాళ్లు అవాక్కయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ అభిమానులు తమపై చూపిన ప్రేమకు ఫిదా అయ్యారు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్తో పాటు స్టార్ పేసర్ షాహిన్ షా అఫ్రిది సోషల్ మీడియా వేదికగా హైదరాబాద్ అభిమానులు చూపిన ప్రేమకు ఫిదా అయినట్లు తెలిపారు.
'హైదరాబాద్ ప్రజల అభిమానం, ప్రేమకు ఫిదా అయ్యాను'అని బాబర్ ఆజామ్ ఇన్ స్టా స్టోరీలో షేర్ చేయగా.. 'భారత్లోని హైదరాబాద్లో మాకు గొప్ప స్వాగతం లభించింది.'అని షాహిన్ షా అఫ్రిది ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్స్ నెట్టింట వైరల్గా మారాయి.
శుక్రవారం ఉప్పల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో పాక్ తన తొలి వార్మప్ మ్యాచ్ ఆడనుంది. పాకిస్థాన్ చివరగా 2016 టీ20 ప్రపంచకప్ కోసం భారత్కు వచ్చింది. అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది.

హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్ జట్టు రెండు వామప్ మ్యాచ్లు.. రెండు ప్రపంచకప్ మ్యాచ్లు ఆడనుంది. శుక్రవారం న్యూజిలాండ్తో తొలి వామప్ మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్.. అక్టోబర్ 3న ఆస్ట్రేలియాతో రెండో వామప్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6న నెదర్లాండ్స్తో ప్రపంచకప్ మ్యాచ్ ఆడనున్న పాకిస్థాన్.. అక్టోబర్ 10న శ్రీలంకతో జరిగే రెండో మ్యాచ్లో అమీతుమీ తేల్చుకోనుంది.
ఉప్పల్ వేదికగా జరిగే తొలి వామప్ మ్యాచ్(పాక్-న్యూజిలాండ్) ప్రేక్షకుల్లేకుండా ఖాళీ మైదానంలో జరగనుంది. నగరంలో వినాయక నిమజ్జనం ఉండటంతో భద్రత కల్పించలేమని హైదరాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. దాంతో ఈ మ్యాచ్ను ప్రేక్షకుల్లేకుండానే నిర్వహించేందుకు హెచ్సీఏ సిద్దమైంది.