హైదరాబాద్: వన్డే ప్రపంచకప్ ముందు ఆస్ట్రేలియా సన్నాహకం అదిరింది. పాకిస్థాన్తో ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన వామప్ మ్యాచ్లో సమష్టిగా రాణించి ఆస్ట్రేలియా 14 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బ్యాటింగ్కు అనుకూలమైన ఉప్పల్ పిచ్పై ఇరు జట్ల బ్యాటర్లు పండుగ చేసుకున్నారు.
ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 351 పరుగులు చేసింది. గ్లేన్ మ్యాక్స్వెల్(71 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్లతో 77), కామెరూన్ గ్రీన్(40 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించారు. డేవిడ్ వార్నర్(33 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 48), జోష్ ఇంగ్లీష్(30 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 48) తృటిలో హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు.

పాకిస్థాన్ బౌలర్లలో ఉసామా మీర్ రెండు వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్, మహమ్మద్ వాసీమ్, షాదాబ్ ఖాన్, మహమ్మద్ నవాజ్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ 47.4 ఓవర్లలో 337 పరుగులకు కుప్పకూలింది.
ఇఫ్తికర్ అహ్మద్(85 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 83), బాబర్ ఆజామ్(59 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్లతో 90) విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగారు. మహమ్మద్ నవాజ్(42 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 50) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో మార్నస్ లబుషేన్ మూడు వికెట్లు తీయగా.. ప్యాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్లేన్ మ్యాక్స్వెల్, సీన్ అబాట్ తలో వికెట్ తీసారు.
ఓ దశలో మెరుగైన స్థితిలో నిలిచిన పాకిస్థాన్.. బాబర్ ఆజామ్ రిటైర్డ్ హర్ట్గా వెనుదిరగడంతో ఓటమి పాలైంది. వన్డే ప్రపంచకప్ 2023కు మరో రెండు రోజుల్లో తెరలేవనుండగా.. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ తలపడనున్నాయి. అక్టోబర్ 8న భారత్, ఆస్ట్రేలియా జట్లు తొలి మ్యాచ్ ఆడనున్నాయి.
ఓవైపు వర్షం కారణంగా భారత్ వామప్ మ్యాచ్లు బంతి పడకుండా రద్దవ్వగా.. ఆసీస్ మాత్రం సూపర్ ప్రాక్టీస్ చేసింది. ఇది ఆ జట్టుకు కలిసి రానుంది. అయితే చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా.. ఆ జట్టు రెండు వామప్ మ్యాచ్లను భిన్నమైన పిచ్ల్లో ఆడింది. ఇది టీమిండియాకు సానుకూలంశం.