న్యూఢిల్లీ: ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్ను ఐసీసీ విడుదల చేసింది. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీ వివరాలను మంగళవారం వెల్లడించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే ఈ టోర్నీలో మొత్తం 10 జట్ల మధ్య 48 మ్యాచ్లు జరగనున్నాయి.
రౌండ్ రాబిన్ పద్దతి ప్రకారం ప్రతీ జట్టు ఇతర జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఈ లెక్కన అన్నీ జట్లు 9 మ్యాచ్లు చొప్పున ఆడుతాయి. ఇందులో ఎక్కువ మ్యాచ్లు గెలిచి టాప్-4లో నిలిచే జట్లు నాకౌట్కు అర్హత సాధిస్తాయి. పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు.. నాలుగో స్థానంలో నిలిచిన టీమ్తో తొలి సెమీఫైనల్ ఆడనుంది.

నంబర్-2, నంబర్-3 జట్ల మధ్య రెండో సెమీఫైనల్ జరగనుంది. వరల్డ్ కప్ చరిత్రలో రౌండ్ రాబిన్ పద్దతిలో మెగా టోర్నీని నిర్వహించడం ఇది మూడోసారి మాత్రమే. ఇంతకుముందు 1992, 2019లో ఈ ఫార్మాట్లో ఈ టోర్నీని నిర్వహించారు. ఈ రెండు సార్లు టీమిండియా విజేతగా నిలవలేకపోయింది.
1992లో ఈ ఫార్మాట్లో తొలిసారి ఆడినప్పుడు టీమిండియా నాకౌట్ చేరకుండానే ఇంటిదారిపట్టింది. 2019లో సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఓడి నిష్క్రమించింది. ఈ రికార్డులే ఇప్పుడు టీమిండియాను కలవరపెడుతున్నాయి. అయితే ఈ ఫార్మాట్ ద్వారా ప్రతీ జట్టుకు మెరుగైన అవకాశాలు లభిస్తాయి. ఒక మ్యాచ్లో ఓడినా.. మరో మ్యాచ్లో గెలిచి సెమీఫైనల్ రేసులో నిలవచ్చు. ఈ ఫార్మాట్తో టోర్నీ ఉత్కంఠగా సాగనుంది.
అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుండగా.. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 15న జరిగే మ్యాచ్లో దాయాదీ పాకిస్థాన్తో తలపడనుంది. నవంబర్ 15, 16న ముంబై, కోల్కతా వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్లు జరగనుండగా.. అహ్మదాబాద్ వేదికగా నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది.
రెండు సెమీ ఫైనల్స్తోపాటు ఫైనల్ మ్యాచ్కు రిజర్వ్ డే (నవంబర్ 20)ను కేటాయించారు. ప్రపంచకప్ మ్యాచ్లను ధర్మశాల, ఢిల్లీ, లక్నో, పుణే, ముంబై, అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్కతా వేదికలుగా మ్యాచ్లు జరగనున్నాయి.