న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతున్నా కొద్దీ అభిమానుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ఈ మెగా టోర్నీ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అటు అభిమానులు.. ఇటు మాజీ క్రికెటర్లు మెగా టోర్నీ గురించే చర్చిస్తున్నారు. తమ అంచనాలను వెల్లడిస్తున్నారు. టీమ్ కాంబినేషన్ గురించి చర్చిస్తున్నారు.
వరల్డ్కప్కు ఇంకా రెండు నెలల సమయం ఉన్నా.. ఈ మెగా టోర్నీ బజ్ అప్పుడే మొదలైంది. తాజాగా సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ మెగా టోర్నీ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. సెమీఫైనల్ చేరే జట్ల వివరాలను వెల్లడించాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన డివిలియర్స్.. తన సహచర ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి కూడా ఆసక్తికర విషయాలు చెప్పాడు.

'అప్కమింగ్ వన్డే ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ దుమ్మురేపితే టీమిండియాకు టైటిల్ గెలిచే అవకాశాలుంటాయి. కోహ్లీ రాణించడంపైనే ఆ జట్టు విజయవకాశాలు ఆధారపడి ఉన్నాయి. నా అంచనా ప్రకారం భారత్తో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా సెమీఫైనల్ చేరుతాయి. ఫైనల్లో భారత్-ఆస్ట్రేలియా తలపడే అవకాశం ఉంది.
విరాట్ కోహ్లీ నా ఫేవరేట్ ఐపీఎల్ బ్యాటర్. అతనితో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఆస్వాదిస్తాను. అతనో గొప్ప వ్యక్తి. మానవతావాది. ఆటగాళ్లను ఎప్పుడూ మోటీవేట్ చేస్తుంటాడు. మైదానంలో దూకుడుగా ఉంటాడు. విజయకాంక్షతో ఆడుతాడు. కానీ ఆఫ్ ఫీల్డ్లో మాత్రం చాలా సరదాగా.. ప్రశాంతంగా ఉంటాడు.
ఆటగాళ్లకు సాయం చేయడంలో.. వారిని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు. నేను ఎప్పటికీ ఆర్సీబీ మనిషినే. భవిష్యత్తులో ఆర్సీబీ జట్టుకు పని చేయాలనే కోరిక ఉంది. అక్టోబర్-నవంబర్ సమయంలో నేను భారత్కు రాబోతున్నాను. అనాథ పిల్లలకు సాయం చేసేందుకు చారీటీ నిర్వహించే పనుల్లో భాగమవుతాను.
అనాథ బాలలు, అభాగ్యులను ఆదుకోవడంలో నేనెప్పుడు ముందుంటాను. భవిష్యత్తులో పేదవారి కోసం మేం భారత్లో ఇళ్లు కూడా నిర్మించాలనుకుంటున్నాం.'అని ఏబీ డివిలియర్స్ చెప్పుకొచ్చాడు.