World Cup 2023: భారత్ వేదికగా రసవత్తరంగా సాగుతున్న వన్డే ప్రపంచకప్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే యావత్ దేశం ఈ క్రికెట్ మత్తులో తేలియాడుతోంది. సెమీస్ ఆడే నాలుగు జట్లు ఖరారవ్వగా.. ఆదివారం ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్తో లీగ్ దశకు తెరపడనుంది.
నవంబర్ 15న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ముంబై వేదికగా తొలి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. అద్భుతం జరిగి పాకిస్థాన్ సెమీస్ రేసులోకి దూసుకొస్తే తప్పా.. భారత్ సెమీస్ ప్రత్యర్థి మారదు. నవంబర్ 16న సౌతాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్ జరగాల్సి ఉంది.

అయితే తొలి సెమీస్కు ముందే దేశ ప్రజలు దీపావళి పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో శుక్రవారం ముంబై లోని అరేబియా సముద్ర ఒడ్డు తీరాన ఉన్న 'గేట్ వే ఆఫ్ ఇండియా'పై లైటింగ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంతో అభిమానులకు ముందస్తు వరల్డ్ కప్ దీపావళి వేడుకలు అందించారు.
భారతదేశ ముఖద్వారంగా పిలుచుకునే గేట్ వే ఆప్ ఇండియాపై వరల్డ్ కప్ థీమ్స్తో పాటు సెమీస్కు చేరిన జట్ల వివరాలు.. టోర్నీలో కీలకంగా మారి ఘట్టాలు.. అసాధారణ ప్రదర్శన ఆటగాళ్ల ఫొటోలను థీమ్స్గా ప్రదర్శించారు. ఈ ప్రపంచకప్ సంతోషంతో పాటు గౌరవాన్ని తెచ్చిందని ఐసీసీ పలు ఫొటోలను ప్రదర్శించింది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్, సఫారీ విధ్వంసక వీరులు హెన్రిచ్ క్లాసెన్, పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్తో పాటు నవీన్ ఉల్ హక్ ఫోటోలకు సంబంధించిన లైటింగ్ షో వీక్షకులను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
నెదర్లాండ్స్ ఆటగాళ్లు 'నమస్తే' అంటూ ఫోజ్ ఇవ్వడం, విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్లు వైరాన్ని మరిచి పలకరించుకోవడాన్ని హైలైట్ చేస్తూ చూపించిన థీమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అసాధారణ ప్రదర్శన కనబర్చిన మ్యాక్స్వెల్, క్లాసెన్, ఫకార్ జమాన్లను పవర్ థీమ్తో చూపించడం ఆకట్టుకుంది. సెంచరీల హీరోలుగా కోహ్లీ, క్వింటన్ డికాక్ థీమ్ ప్లే చేశారు.