వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) 2024 టోర్నీలో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. పాకిస్థాన్ ఛాంపియన్స్తో ఆదివారం జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్ను ముద్దాడింది. రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజ ఆటగాళ్లతో జరిగిన ఈ టోర్నీ మినీ ప్రపంచకప్ను తలపించింది.
అయితే ఈ మ్యాచ్లో ఎదురైన పరాజయాన్ని పాకిస్థాన్ అభిమానులు, జరల్నిస్ట్లు తట్టుకోలేకపోతున్నారు. అసత్య ఆరోపణలతో భారత విజయాన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ టోర్నీ ఫైనల్లో భారత్ ఛీటింగ్ చేసి విజయం సాధించిందని ఆరోపిస్తున్నారు.

ఈ ఫైనల్ మ్యాచ్లో అద్భుత బ్యాటింగ్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన అంబటి రాయుడు (30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50)ఈ టోర్నీ ఆడేందుకు అనర్హుడని కామెంట్ చేస్తున్నారు. ప్రొఫెషనల్ క్రికెట్ లీగ్కు పూర్తిగా దూరం కానీ రాయుడు ఈ టోర్నీ ఎలా ఆడుతారు? అని ప్రశ్నిస్తున్నారు.
అంబటి రాయుడు భారత క్రికెట్కు మాత్రమే దూరమయ్యాడని, విదేశాల్లో జరుగుతున్న క్రికెట్ లీగ్స్ ఆడుతున్నారని గుర్తు చేస్తున్నారు. 40 ఏళ్ల కూడా నిండని రాయుడు.. దూకుడైన బ్యాటింగ్తో భారత్కు విజయాన్నందించాడని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
అర్థం పర్థం లేని ఆరోపణలతో యువరాజ్ సింగ్ సేన సాధించిన విజయాన్ని ఎగతాళి చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను భారత అభిమానులు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. అంబటి రాయుడి గురించి మాట్లాడే ముందు పాక్ జట్టులోని పలువురు ఆటగాళ్లను కూడా నిలదీయాలని సూచిస్తున్నారు.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకని షోయబ్ మాలిక్ను ఎలా ఆడించారని ప్రశ్నిస్తున్నారు. అతను కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న లీగ్స్ ఆడుతున్నాడని గుర్తు చేస్తున్నారు. అతనే కాకుండా పాకిస్థాన్ ఛాంపియన్స్ జట్టులోని సర్జీల్ ఖాన్, అమీర్ యామిన్ ఖాన్ వయసు 34 ఏళ్లు మాత్రమేనని, వారిని ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. భారత్ చేతిలో ఓటమిని తట్టుకోలేక పాక్ జర్నలిస్ట్లు, అభిమానులు ఇలాంటి లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. షోయబ్ మాలిక్(36 బంతుల్లో 41) టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత పేసర్ అనురీత్ సింగ్ మూడు వికెట్లతో పాకిస్థాన్ పతనాన్ని శాసించాడు. వినయ్ కుమార్, పవన్ నేగి, హర్భజన్ సింగ్లు తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ఇండియా ఛాంపియన్స్ 19.1 ఓవర్లలో 5 వికెట్లకు 159 పరుగులు చేసి విజయాన్నందుకుంది. అంబటి రాయుడు(30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50) హాఫ్ సెంచరీతో రాణించగా.. యూసఫ్ పఠాన్(16 బంతుల్లో ఫోర్, 3 సిక్సర్లతో 30) మెరుపులు మెరిపించాడు. గుర్క్రీత్ సింగ్(33 బంతుల్లో 34) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పాకిస్థాన్ బౌలర్లలో అమీర్ యామిన్ 2 వికెట్లు తీయగా.. అజ్మల్, షోయబ్ మాలిక్, వాహబ్ తలో వికెట్ పడగొట్టారు.