వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్కు రెండు స్వర్ణాలు లభించాయి. జైస్మీన్ లాంబోరియా, మీనాక్షి హుడా విజేతగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల 48 కిలోల విభాగం ఫైనల్లో మీనాక్షి హుడా 4-1 తేడాతో కజకిస్థాన్ ప్లేయర్ సజీమ్ కైజైబేపై విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి వ్యూహాత్మకంగా ఆడిన మీనాక్షి ప్రత్యర్థిపై క్రమం తప్పకుండా పంచ్లు విసిరి.. ఆధిపత్యం చెలాయించింది. ఈ బౌట్లో తన ఎత్తును అడ్వాంటేజ్గా మార్చుకుంది. బ్యాక్ఫుట్పై ఉంటూ ప్రత్యర్థిపై దాడి చేసింది. బలమైన డిఫెన్స్తో ప్రత్యర్థి పంచ్లను కాచుకుని విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతకుముందు జరిగిన మహిళల 57 కేజీల విభాగంలో జైస్మీన్ లాంబోరియా 4-1 తేడాతో పోలండ్కు చెందిన జూలియాను ఓడించింది. మరోవైపు భారత్కు చెందిన నుపుర్ షెరోన్(80+ కేజీలు) సిల్వర్ మెడల్ సాధించగా.. పుజారాణి(80 కేజీలు) బ్రాంజ్ మెడల్ గెలిచింది. పురుషుల విభాగంలో ఈ సారి భారత్కు ఒక్క పతకం రాలేదు. 2013 తర్వాత పురుషుల విభాగంలో భారత్ ఒక్క పతకం కూడా సాధించకపోవడం ఇదే తొలిసారి.

భారత స్టార్ బాక్సర్, తెలుగు తేజం నిఖత్ జరీన్ పోరాటం మాత్రం క్వార్టర్స్లోనే ముగిసింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ మాజీ ఛాంపియన్ క్వార్టర్ ఫైనల్లో 0-5తో రెండుసార్లు ఒలింపిక్ రజత పతక విజేత బ్యూస్ నాజ్ కకిరోగ్లు (తుర్కియే) చేతిలో చిత్తయింది. దాంతో పతకం లేకుండా నిఖత్ జరీన్ ఇంటిబాట పట్టింది. గతసారి (2023) 50 కిలోలు, అంతకుముందు (2022) 52 కిలోల విభాగాలలో ప్రపంచ చాంపియన్గా నిలిచిన నిఖత్ ఈసారి 51 కిలోల బరిలో దిగింది.