మహిళల వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో పాకిస్థాన్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. భారత మహిళల జట్టుతో ఆదివారం జరిగిన తమ రెండో లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ 88 పరుగుల భారీ తేడాతో చిత్తయ్యింది. ఈ మ్యాచ్లో ఓడినా పాకిస్థాన్ మహిళల జట్టు సరికొత్త రికార్డ్తో చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే భారత్ జట్టును పాకిస్థాన్ ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్లో భారత్ ఆలౌట్ అయినప్పటికీ.. భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
కొలంబో వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు పాకిస్థాన్ బౌలర్లు గట్టి షాకిచ్చారు. కట్టుదిట్టమైన బౌలింగ్తో క్రమం తప్పకుండా వికెట్లు తీసారు. స్మృతి మంధాన(23), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(19) నిరాశపర్చడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 247 పరుగులకే కుప్పకూలింది. ప్రతికా రావల్(31), హర్లీన్ డియోల్(46), జెమీమా రోడ్రిగ్స్(32), రిచా ఘోష్(35 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్ బౌలర్లలో డయానా బైగ్(4/69) నాలుగు వికెట్లు తీయగా.. సదియా ఇక్బాల్, ఫాతిమా సనా రెండేసి వికెట్లు పడగొట్టారు. రమీన్ షమీమ్, నష్రా సంధు చెరో వికెట్ పడగొట్టారు.

ఈ మ్యాచ్కు ముందు ఇరు జట్ల మధ్య 11 వన్డేలు జరగ్గా..ఒక్కసారి కూడా టీమిండియాను పాకిస్థాన్ ఆలౌట్ చేయలేకపోయింది. భారత భీకర బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చినప్పటికీ.. ఈ మ్యాచ్లో పాకిస్థాన్కు నిరాశే ఎదురైంది. 248 పరుగుల లక్ష్యచేధనలో పాకిస్థాన్ 159 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని చవిచూసింది. వన్డే క్రికెట్లో పాకిస్థాన్పై భారత్ 12వ విజయం సాధించింది. 12 మ్యాచ్లకు 12 గెలిచి తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.
ఈ టోర్నీలో పాకిస్థాన్కు ఇది వరుసగా రెండో పరాజయం. బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లోనూ పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. మరోవైపు భారత మహిళల జట్టు వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది. శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో డీఎల్ఎస్ పద్దతిన 59 పరుగుల తేడాతో గెలిచింది. టీమిండియా తమ తదుపరి మ్యాచ్లో సౌతాఫ్రికాతో గురువారం తలపడనుంది. మరోవైపు పాకిస్థాన్ బుధవారం ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది.