
న్యూఢిల్లీ: మహిళల టీ20 ప్రపంచకప్లో భారత జట్టు పరాజయంపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. మెగా టోర్నీలో భారత్ జట్టును దురదృష్టం వెంటాడుతుందన్నాడు. కీలక సెమీఫైనల్లో క్రీజులో ఉన్న మ్యాచ్ విన్నర్ రనౌటవ్వడం మరోసారి రిపీట్ అయిందని ట్వీట్ చేశాడు. టీ20 ప్రపంచకప్లో భారత్ ఓడటం నిరాశకు గురిచేసిందన్నాడు.
పటిష్టమైన ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన కీలక సెమీఫైనల్లో సమష్టిగా విఫలమైన హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 5 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. భారత్ అమ్మాయిలు మరోసారి ఒత్తిడిని తట్టుకోలేకపోయారు. ఐదు టైటిళ్లతో మహిళల టీ20 ప్రపంచకప్లో తిరుగులేని జట్టుగా నిలిచిన ఆసీస్పై గెలవాలంటే ఎలాంటి తప్పిదాలు చేయకుండా ఉత్తమంగా రాణించాలని తెలిసినా... హర్మన్సేన ఆ పని చేయలేకపోయింది.
అనవసర తప్పిదాలతో చేజేతులా గెలిచే మ్యాచ్ను చేజార్చుకుంది. ఫీల్డింగ్లో క్యాచ్లు పట్టలేక, మైదానంలో చురుగ్గా కదల్లేక, బ్యాటింగ్లో వికెట్లు పారేసుకుని చివరకు ఓటమికి తలవంచింది. ముఖ్యంగా ఫీల్డింగ్ సమయంలో ఆసీస్ కీలక బ్యాటర్లు ఇచ్చిన క్యాచ్లను నేలపాలు చేయడం భారత ఓటమిని శాసించింది. ఈ పరాజయంపై సెహ్వాగ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. భారత అమ్మాయిలను కొనియాడాడు.
'సెమీఫైనల్లో క్రీజులో ఉన్న మ్యాచ్ విన్నర్ రనౌటవ్వడం గతంలోనూ జరిగింది. మెగా టోర్నీ నుంచి భారత్ నిష్క్రమించడం నిరాశకు గురి చేసింది. గెలిచే మ్యాచ్లో భారత్ ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా మరోసారి తమను ఓడించడం అంత సులువు కాదని నిరూపించింది. ఓడినా మనమ్మాయిలు అద్భుతంగా పోరాడారు'అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 172 పరుగులు చేసింది. బెత్ మూనీ(37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 54), మెగ్ లానింగ్(34 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 49 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రాధా యాదవ్ తలో వికెట్ తీయగా..శిఖా పాండే రెండు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. హర్మన్ప్రీత్ కౌర్(34బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52), జెమీమా రోడ్రిగ్స్(24 బంతుల్లో 6 ఫోర్లతో 43) రాణించినా ఫలితం లేకపోయింది.