మహిళల టీ20 ప్రపంచకప్ 2024ను బంగ్లాదేశ్ నుంచి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) తరలించింది. యూఏఈ వేదికగా ఈ టోర్నీ నిర్వహిస్తామని ప్రకటించింది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. 'క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మహిళల టీ20 ప్రపంచకప్.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆతిథ్యంలోనే యూఏఈ వేదికగా నిర్వహిస్తున్నాం.'అని ఐసీసీ ప్రకటించింది.
బంగ్లాదేశ్ టోర్నమెంట్కు ఆతిథ్యం ఇవ్వకపోవడం నిరాశ కలిగించిందని, ఈ టోర్నీకి అవసరమైన అన్ని సన్నాహాలను బీసీబీ పూర్తి చేసిందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డైస్ తన ప్రకటనలో తెలిపారు. ఈ ఈవెంట్ను నిర్వహించడానికి మద్దతు తెలిపిన శ్రీలంక, జింబాబ్వేలకు ఐసీసీ కృతజ్ఞతలు తెలిపింది. భవిష్యత్తులో ఈ రెండు దేశాలలో ఐసిసి ఈవెంట్లను నిర్వహించాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.

అయితే ఆటగాళ్లు, దేశాల ప్రతినిధిలు బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేయడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ వేదికగా ఈ టోర్నీ నిర్వహిస్తే హాజరుకాలేమని తేల్చిచెప్పినట్లు సమాచారం. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మహిళల టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి 20 వరకు జరగాల్సి ఉంది. వారం రోజుల ముందుగానే సెప్టెంబర్ 27 నుంచి వార్మప్ మ్యాచ్లు మొదలవుతాయి.