
కేప్టౌన్: మహిళల టీ20 ప్రపంచకప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్తో బుధవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన టీమిండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. బౌలింగ్లో దీప్తి శర్మ(3/11) తీన్మార్ వేయగా.. బ్యాటింగ్లో రిచా ఘోష్(32 బంతుల్లో 5 ఫోర్లతో 44 నాటౌట్) మెరుపులు మెరిపించింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 118 పరుగులు చేసింది. ఓపెనర్ స్టెఫానీ టైలర్(40 బంతుల్లో 6 ఫోర్లతో 42), కాంప్బెల్లే(36 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించింది. రేణుకా సింగ్, పుజా వస్త్రాకర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన టీమిండియా 18.1 ఓవర్లలోనే 4 వికెట్లకు 119 పరుగులు చేసి 11 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది. భారత బ్యాటర్లలో రిచా ఘోష్(44), హర్మన్ ప్రీత్ కౌర్(42 బంతుల్లో 3 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్థాన్తో మ్యాచ్కు దూరమైన స్మృతి మంధానా(10) ఈ మ్యాచ్తో రీఎంట్రీ ఇచ్చినా.. ఆకట్టుకోలేకపోయింది.
మరో ఓపెనర్ షెఫాలీ వర్మ(23 బంతుల్లో 5 ఫోర్లతో 28) మెరుపులు మెరిపించగా.. గత మ్యాచ్ విన్నర్ జెమీమా రోడ్రిగ్స్(1) విఫలమైంది. 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టును కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్ ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 72 పరుగులు జోడించారు. చివర్లో హర్మన్ ఔటైనా.. రిచా ఘోష్ విజయ లాంఛనాన్ని పూర్తి చేసింది. వెస్టిండీస్ బౌలర్లలో కరిష్మా రామ్హరక్ రెండు వికెట్లు తీయగా.. చినెల్లే హెన్రీ, హెవ్లీ మాథ్యూస్ తలో వికెట్ తీసారు. బౌలింగ్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన దీప్తి శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను శనివారం ఇంగ్లండ్తో ఆడనుంది.