మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. అంపైర్లు చేసిన ఘోర తప్పిదంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటర్ అమెలియా కేర్ రనౌటైనా అంపైర్లు ఆమెను వెనక్కిపిలవడం చర్చనీయాంశమైంది.
దీప్తి శర్మ వేసిన 14వ ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ చివరి బంతిని అమెలియా కేర్ లాంగాఫ్ దిశగా ఆడి క్విక్ డబుల్కు ప్రయత్నించింది. ముందుగా సింగిల్ తీసిన అమెలియా కేర్.. కాస్త సమయం తీసుకొని రెండో పరుగుకు పరుగెత్తింది. బంతిని అందుకున్న హర్మన్ప్రీత్ కౌర్ అప్రమత్తమై వికెట్ కీపర్ రిచా ఘోష్కు అందించింది.

బంతిని స్వీకరించిన రిచా ఘోష్ ఎలాంటి తప్పిదం చేయకుండా వికెట్లను కొట్టేసింది. దాంతో అమెలియా కేర్ రనౌట్గా పెవిలియన్ బాట పట్టగా.. భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కానీ ఫీల్డ్ అంపైర్లు ఇద్దరూ పెద్ద ట్విస్ట్ ఇస్తూ అమెలియా కేర్ను వెనక్కి రప్పించారు.
చివరి బంతికి సింగిల్ తీసిన వెంటనే తాను ఓవర్ పూర్తయిందని చెప్పానని, అలా చెప్పిన తర్వాత పరుగు తీసినా.. వికెట్ అయినా లెక్కలోకి రాదని, బంతి డెడ్ అవుతుందని హర్మన్ప్రీత్ కౌర్కు వివరణ ఇచ్చారు. అయితే ఈ వివరణపై హర్మన్ప్రీత్ కౌర్ అసంతృప్తి వ్యక్తం చేయగా.. అభిమానులు అయోమయానికి గురయ్యారు.
భారత హెడ్ కోచ్ అమోల్ ముజుందార్.. నాలుగో అంపైర్తో తీవ్రంగా చర్చించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్ వేదికగా పంచుకున్నాడు. రెండో పరుగు తీయడానికి ముందే ఓవర్ ముగిసిందని అంపైర్లు చెప్పారని, ఇందులో తప్పేవరిది? అని తన సతీమణి ప్రీతీనారయణ్ను ట్యాగ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఆ మరుసటి ఓవర్లోనే అమెలియా కేర్(13) క్యాచ్ ఔట్గా వెనుదిరిగింది.