
పటిష్టమైన ఆసీస్..
అయితే తమకంటే ఎంతో రెట్లు మెరుగైన ఆస్ట్రేలియాను టీమిండియా ఓడించడం స్థాయికి మించిన పనే. ఒకప్పుడు ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ ఎంత ఆధిపత్యం చెలాయించిందో అంతకు మించి మహిళల టీమ్ డామినేట్ చేస్తోంది. ఈ మధ్య కాలంలో ఆసీస్ మహిళల టీమ్ ఫైనల్ చేరకుండా ఒక్క ఐసీసీ టోర్నీ జరగలేదంటేనే ఆ జట్టు ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు.
ఆస్ట్రేలియా వేదికగా 2021 టీ20 ప్రపంచకప్ ఫైనల్లోనూ టీమిండియా.. ఆసీస్ చేతిలోనే చిత్తుగా ఓడి టైటిల్ చేజార్చుకుంది. జట్టు నిండా ఆల్రౌండర్లు ఉండటం ఆసీస్ టీమ్ ప్రధాన బలం. 9వ నెంబర్ వరకు బ్యాటింగ్ చేయగల ప్లేయర్లు ఆ జట్టులో ఉన్నారు.

ఆసీస్ ఓడిస్తే టైటిల్ భారత్దే..
ఇంత పటిష్టమైన ఆసీస్ను సెమీస్లో గనుక భారత్ ఓడిస్తే.. ఫైనల్లో కూడా సునాయసంగా గెలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆసీస్ను ఓడిస్తే ప్రపంచాన్నే జయించామనే ఆత్మవిశ్వాసం భారత ప్లేయర్ల సొంతమవుతోందని, ఆ మూమెంటమ్ వేరేలా ఉంటుందని చెబుతున్నారు.
ఆసీస్ వంటి పటిష్టమైన జట్టును ఓడించాలంటే భారత మహిళలు ఒకరిద్దరి ప్రదర్శనపై ఆధారపకుండా సమష్టిగా రాణించాల్సి ఉంటుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో ఏ ఒక్క తప్పిదం లేకుండా రాణిస్తే ఆసీస్ను మట్టికరిపించవచ్చు.

జిడ్డు బ్యాటింగ్ వదిలి..
ముఖ్యంగా భారత మహిళలు టీ20 ఫార్మాట్కు తగ్గట్లు ధాటిగా ఆడాల్సిన అవసరం ఉంది. లీగ్ మ్యాచ్ల్లో జిడ్డు బ్యాటింగ్తో నసపెట్టిన బ్యాటర్లు.. వారి అప్రోచ్ను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సూపర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం.
అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన షెఫాలీ వర్మ.. ధాటిగా ఆడాల్సి ఉంది. పాకిస్థాన్తో హాఫ్ సెంచరీతో మెరిసిన జెమీమా.. తర్వాత మూడు మ్యాచ్ల్లో విఫలమైంది. ఆమె రాణించడం జట్టుకు చాలా కీలకం. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇప్పటి వరకు చెప్పుకో దగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. దాంతో మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది.

సమష్టిగా రాణిస్తేనే..
వికెట్ కీపర్ రిచా ఘోష్ ఫినిషర్ రోల్ను సమర్థవంతంగా నిర్వర్తిస్తోంది. ఆల్రౌండర్స్ పూజా వస్త్రాకర్, దీప్తి శర్మలు సైతం సత్తా చాటాల్సి ఉంది.
రేణుకా సింగ్, శిఖా పాండేలతో బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉంది. బౌలింగ్లో దీప్తి శర్మ కూడా ఆకట్టుకుంటుంది. మహిళల టీ20 ప్రపంచకప్ను సాధిస్తే.. భారత్లో వారికి ఆదరణ రెండింతలు అవ్వడం ఖాయం.


Click it and Unblock the Notifications












