
గాబెరా: మహిళల టీ20 ప్రపంచకప్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు కీలక పోరుకు సిద్ధమైంది. నేడు (సోమవారం) ఐర్లాండ్తో జరగనున్న చివరి లీగ్ మ్యాచ్లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా టీమిండియా సెమీస్ చేరుతుంది. ఓడితే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. పాకిస్థాన్, వెస్టిండీస్ జట్లను మట్టికరిపించిన హర్మన్ సేన.. ఇంగ్లండ్తో మాత్రం చేతులెత్తేసింది. పేలవ బ్యాటింగ్తో 11 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ పరాజయంతో పాయింట్స్ టేబుల్లో ప్రస్తుతం 3 మ్యాచ్ల్లో 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడింటికి మూడు గెలిచిన ఇంగ్లండ్.. అగ్రస్థానంలో నిలిచి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఒకవేళ ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడి.. ఇంగ్లండ్పై తన చివరి మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధిస్తే ఆ జట్టే ముందంజ వేస్తుంది. నెట్ రన్రేట్లో పాక్ కంటే భారత్ వెనుకబడి ఉండడమే దీనికి కారణం. భారత్తో సమానంగా 4 పాయింట్లు సాధించిన వెస్టిండీస్ నెట్ రన్రేట్ కూడా దారుణంగా ఉంది. ఆ జట్టు మ్యాచ్లు కూడా పూర్తయ్యాయి.

భారత్, పాక్ తమ చివరి మ్యాచ్ల్లో ఓడి.. నెట్రన్రేట్లో విండీస్ కంటే వెనుకబడి ఉంటే కరేబియన్ జట్టుకు రెండో సెమీస్ బెర్తు దక్కుతుంది. ఐర్లాండ్ చేతిలో ఓడి.. పాక్పై ఇంగ్లండ్ గెలిచినా మెరుగైన రన్రేట్ ఉంటే భారత్ రెండో టీమ్గా సెమీస్ చేరుతోంది. ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ ఓడి ఇప్పటికే నాకౌట్ రేసుకు దూరమైన ఐర్లాండ్ను ఓడించడం భారత్కు పెద్ద కష్టం కాకపోవచ్చు. కానీ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ఐర్లాండ్ను ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.

ఇంగ్లండ్తో హాఫ్ సెంచరీ బాదిన స్మృతి మంధాన.. పరిస్థితులకు తగ్గట్లు చివరి వరకు క్రీజులో ఉండి విజయం అందించాల్సి ఉంది. జెమీమా రోడ్రిగ్స్ పాకిస్థాన్తో మ్యాచ్లో చెలరేగి ఆడినా.. వెస్టిండీస్, ఇంగ్లండ్ మ్యాచ్లో విఫలమైంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఇప్పటి వరకు ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అండర్-19 ప్రపంచకప్లో సత్తా చాటి టైటిల్ అందించిన ఓపెనర్ షెఫాలీ వర్మ కూడా ఆ జోరు కొనసాగించలేకపోతుంది. ఫీల్డింగ్లోనూ చాలా మెరుగుపడాల్సి ఉంది. ముఖ్యంగా క్యాచ్లు నేలపాలు చేయడం భారత్కు బలహీనతగా మారింది. ఈ విషయంలో చాలా మెరుగుపడాలి. రిచా ఘోష్ ఒక్కతే నిలకడగా రాణిస్తోంది. సెమీస్ చేరాలంటే భారత్ ఈ బలహీనతలను అధిగమించాల్సి ఉంటుంది.