మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో న్యూజిలాండ్ ఫైనల్కు దూసుకెళ్లింది. వెస్టిండీస్తో శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో న్యూజిలాండ్ 8 పరుగుల తేడాతో గెలుపొందింది. హోరా హోరీగా సాగిన ఈ లోస్కోరింగ్ గేమ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులు చేసింది. జార్జియా ప్లిమ్మర్(33), సుజీ బేట్స్(26), ఇసాబెల్లా గేజ్(20 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
వెస్టిండీస్ బౌలర్లలో డియెండ్రా డాటిన్(4/22) నాలుగు వికెట్లు తీయగా.. అఫీ ప్లెట్చర్ రెండు, కరిష్మా, అలియా తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 120 పరుగులే చేసి ఓటమిపాలైంది. డియెండ్రా డాటిన్(33) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. న్యూజిలాండ్ బౌలర్లలో ఎడెన్ కార్సన్ మూడు వికెట్లు తీయగా.. అమెలియా కేర్ రెండు వికెట్లు పడగొట్టింది. ప్రాన్ జోన్స్, లీ తాహుహు, సుజీ బేట్స్ తలో వికెట్ తీసారు.

తమ చివరి లీగ్ మ్యాచ్లో ఇంగ్లండ్ను ఓడించి మరీ సెమీస్ చేరిన వెస్టిండీస్.. ఫైనల్ మాత్రం చేరలేకపోయింది. న్యూజిలాండ్ స్పిన్నర్ల ధాటికి వెస్టిండీస్ 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ డాటిన్ సూపర్ బ్యాటింగ్తో విజయవకాశాలను రేకెత్తించింది. 24 బంతుల్లో 34 పరుగులు చేయాల్సి రావడంతో విండీస్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ డాటిన్ను ఔట్ చేసిన అమెలియా మ్యాచ్ను మలుపు తిప్పింది.
ఆదివారం జరిగే ఫైనల్లో సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ తలపడనుంది. ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
భారత మహిళల జట్టు లీగ్ దశలోనే ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడంతో టీమిండియా సెమీస్ అవకాశాలను దెబ్బతీసాయి.