మహిళల టీ20 ప్రపంచకప్ 2024లో టీమిండియా అగ్ని పరీక్షకు సిద్దమైంది. ఆదివారం జరిగే తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్ చేరాలంటే హర్మన్సేన ఈ మ్యాచ్ తప్పక గెలవాలి. ఈ టోర్నీ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది.
ఆ తర్వాత పాకిస్థాన్ను 6 వికెట్లతో ఓడించిన హర్మన్ సేన.. శ్రీలంకను 82 పరుగులతో చిత్తు చేసి సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. ఇదే జోరులో ఆస్ట్రేలియాను మట్టికరిపించాలనుకుంటోంది. కానీ ఆస్ట్రేలియా హ్యాట్రిక్ విజయాలతో పటిష్టంగా ఉంది. ఆ జట్టును ఓడించాలంటే భారత్ స్థాయికి మించిన ప్రదర్శన చేయాలి. టీ20 ప్రపంచకప్లో ఆసీస్తో ఆడిన ఐదు మ్యాచ్ల్లో భారత్ ఓటమిపాలైంది.

ప్రస్తుతం గ్రూప్-ఏలో టీమిండియా రెండో స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్ చేరుతాయి. 3 మ్యాచ్ల్లో రెండు గెలిచిన భారత్ ఖాతాలో 4 పాయింట్స్ ఉండగా.. మూడింటికి మూడు గెలిచిన ఆసీస్ 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు శ్రీలంక, పాకిస్థాన్తో ఆడాల్సిన న్యూజిలాండ్ రెండూ గెలిస్తే ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్స్ చేరుతాయి. అప్పుడు మెరుగైన రన్ రేట్ ఉన్న రెండు జట్లు సెమీస్ చేరుతాయి.
ఒకవేళ ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడితే మాత్రం... న్యూజిలాండ్ మ్యాచ్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. భారత్ సెమీస్ చేరాలంటే కివీస్ తమ చివరి రెండు మ్యాచ్ల్లో ఓటమిపాలవ్వాలి. లేదంటే ఒకదాంట్లో చిత్తుగా ఓడాలి. భారత్ రన్ రేట్ మిగతా జట్ల కంటే మెరుగ్గా ఉండాలి. అప్పుడే సెమీస్ చేరడానికి ఆస్కారం ఉంటుంది.