
పుణే: మహిళల టీ20 ఛాలెంజ్ టోర్నీలో వెలాసిటీ టీమ్ అరంగేట్ర స్పిన్నర్ మాయా సోనావానే అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ టోర్నీలో భాగంగా మంగళవారం సూపర్నోవాస్తో జరిగిన మ్యాచ్లో తన విభిన్నమైన బౌలింగ్ యాక్షన్తో ఔరా అనిపించింది. సోనావానే బౌలింగ్ చేసేటప్పడు తన తలను బాగా కిందకు ఉంచి బౌలింగ్ చేస్తుంది. దాంతో ఆమె బౌలింగ్ చేస్తుందా? లేక జిమ్నాస్టిక్ విన్యాసం చేస్తుందా? అని బ్యాటర్తో పాటు అభిమానులు గందరగోళానికి గురయ్యారు.
ప్రస్తుతం ఆమె బౌలింగ్ యాక్షన్కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. సోనావానే బౌలింగ్ యాక్షన్ను మాజీ దక్షిణాఫ్రికా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ పాల్ ఆడమ్స్తో అభిమానులు పోల్చుతున్నారు. అతని బౌలింగ్ యాక్షన్ కూడా సోనావానే మాదిరే ఉండేది. అయితే పాల్ ఆడమ్స్ బౌలింగ్ను ఆడటంలో బ్యాటర్లు ఆరంభంలో ఇబ్బంది పడినా.. ఆస్ట్రేలియా బ్యాటర్లు చెలరేగారు. దాంతో అతని బౌలింగ్ కూడా సాధారణంగా మారిపోయింది.
ఈ మ్యాచ్లో దీప్తి శర్మ నేతృత్వంలోని వెలాసిటి జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సూపర్ నోవాస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 150 పరుగులు చేసింది. ఆ జట్టు సారథి హర్మన్ ప్రీత్ కౌర్(51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 71) హాఫ్ సెంచరీతో చెలరేగగా... వికెట్ కీపర్ తానియా బాటియా(36) అండగా నిలిచింది. టాప్-3 బ్యాటర్లు ప్రియా పూనియా(4), డియాండ్ర డాటిన్(6), హర్లీన్ డియోల్(7) దారుణంగా విఫలమవడంతో సూపర్ నోవాస్ 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన హర్మన్ప్రీత్ కౌర్.. తానియా బాటితో కలిసి నాలుగో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యాన్ని అందించింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన వెలాసిటీ టీమ్ 18.2 ఓవర్లలో 3 వికెట్లకు 151 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(33 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్తో 51), లౌర వోల్వార్డ్ట్(35 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 51 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. కెప్టెన్ దీప్తి శర్మ(24 నాటౌట్) విలువైన పరుగులు చేసింది.