Womens IPL టీమ్స్ వేలం.. రేసులో బడా కంపెనీలు! బీసీసీఐకి రూ.4 వేల కోట్లు!

న్యూఢిల్లీ: మహిళల క్రికెట్కు ఆదరణ పెంచాలనే లక్ష్యంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటున్న వుమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి ఎడిషన్కు రంగం సిద్దమవుతోంది. ఐదు ఫ్రాంచైజీలతో మహిళల ఐపీఎల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న బీసీసీఐ.. ఇప్పటికే మీడియా హక్కుల ప్రక్రియను ముగించింది. తాజాగా 5 జట్ల అమ్మకాలకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించింది. టీమ్స్ కొనుగోలు కోసం ఆన్లైన్ బిడ్స్ కోసం విధించిన గడువు నేటి(జనవరి 23)తో ముగిసింది.

రూ.4 వేల కోట్ల ఆదాయం..
మహిళల ఐపీఎల్ జట్ల వేలం ద్వారా బీసీసీఐకి భారీగా ఆదాయం సమకూరనుంది. వేలంలో పాల్గొంటున్న కంపెనీలు ద్వారా రూ.4 వేల కోట్లు సంపాదించనుంది. టీమ్స్ వేలం పాట జనవరి 25న జరగనుండగా.. మొత్తం 30 కంపెనీలు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో పురుషుల ఐపీఎల్కు చెందిన ఫ్రాంచైజీలు కూడా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీరామ్ గ్రూప్, అపోలో, జేకే సిమెంట్ సంస్థలతో పాటు నిలగీరి గ్రూప్, ఏడబ్ల్యూ కట్కూరి గ్రూప్, హల్దీరామ్, చెట్టినాడ్ సిమెంట్, కాప్రీ గ్లోబల్, కొటక్ అండ్ ఆదిత్య బిర్లా, అదానీ గ్రూప్, టారెంట్ గ్రూప్, కంపెనీలు కూడా మహిళల ఐపీఎల్లో భాగమయ్యేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు క్రిక్బజ్ పేర్కొంది.

రూ.800 కోట్లు పలికే చాన్స్..
ఈ కంపెనీలు ఇప్పటికే రూ.5 లక్షలు పెట్టి వేలం ప్రక్రియకు సంబంధించిన పత్రాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో జట్టు కనీస ధర రూ.400 కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. వేలంలో జట్ల కోసం కంపెనీలు రూ. 500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్టు అంచనా. మహిళల ఐపీఎల్కు జనాదరణ బాగానే ఉండటంతో కొన్ని కంపెనీలు రూ.800 కోట్ల వరకు వేలం పాడే అవకాశం ఉందని బిజినెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మీడియా హక్కుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఐపీఎల్ మహిళా టీమ్లను దక్కించుకున్న సంస్థలకు బీసీసీఐ పంచనుంది. అంతేకాదు సెంట్రల్ పూల్ పార్ట్నర్షిప్ నుంచి కొంత భాగాన్నిఇవ్వనుంది. టీమ్ స్పాన్సర్షిప్ ద్వారా సంస్థలకు ఆదాయం రానుంది. గేట్ రెవెన్యూ కూడా అందనుంది.

తప్పుకున్న సీఎస్కే, ఎల్ఎస్జీ, జీటీ..
ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్స్ కూడా వేలంలో మహిళల జట్టును దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాయి. చివరి నిమిషంలో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ రేసులో నుంచి తప్పుకున్నాయి.
బిజినెస్ వ్యూహంలో భాగంగానే మహిళల ఐపీఎల్ టీమ్స్ వేలం నుంచి తప్పుకున్నామని సీఎస్కేకు చెందిన ఓ అధికారి తెలిపారు. మహిళల ఐపీఎల్.. ముంబై వేదికగా మార్చి నెలలో జరగనుంది. ఐదేళ్ల కాలానికి వైకోమ్ సంస్థ మహిళల ఐపీఎల్ మీడియా హక్కులను రూ.951 కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications