మహిళల ఆసియాకప్ 2024 ఫైనల్లో భారత్కు ఊహించని పరాజయం ఎదురైంది. అసాధారణ ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు.. కీలక మ్యాచ్లో మాత్రం దారుణంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో చేతులెత్తేసింది.
ఆతిథ్య శ్రీలంకతో ఆదివారం జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో సమష్టిగా విఫలమైన భారత్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ముందుగా ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన(47 బంతుల్లో 10 ఫోర్లతో 60) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. రిచా ఘోష్(14 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 30), జెమీమా రోడ్రిగ్స్(16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 29) ధాటిగా ఆడారు.

షెఫాలీ వర్మ(16), ఉమ చెత్రీ(9), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(11) తీవ్రంగా నిరాశపర్చడంతో భారత్ సాధారణ స్కోర్కే పరిమితమైంది. శ్రీలంక బౌలర్లలో కవిషా దిల్ హరి రెండు వికెట్లు తీయగా..సచిని, చమరి ఆటపట్టు, పరబోధని తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 18.4 ఓవర్లలోనే 2 వికెట్లకు 167 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. కెప్టెన్ చమరి ఆటపట్టు(43 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 61), హర్షితా సమరవిక్రమా(51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 69 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. కవిషా దిల్హరి(16 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించింది.
భారత బౌలర్లలో దీప్తి శర్మ ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం టీమిండియా కొంపముంచింది. ఆసియా కప్ గెలవడం శ్రీలంక మహిళా జట్టుకు ఇదే తొలిసారి కాగా.. భారత్ ఇప్పటి వరకు ఏడు సార్లు విజేతగా నిలిచింది. 8వ టైటిల్ను తృటిలో చేజార్చుకుంది.