
సిల్హెట్: ఇంగ్లండ్ గడ్డపై వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి జోరు మీదున్న భారత మహిళల క్రికెట్ జట్టు.. మరో మెగా టోర్నీకి సిద్దమైంది. మహిళల ఆసియాకప్లో భాగంగా శనివారం భారత్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక మహిళల జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టీ20 ఫార్మాట్లో చేజింగ్కు అడ్వాంటేజ్ ఉన్న నేపథ్యంలోనే లంక కెప్టెన్ చమరి ఆటపట్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక భారత్ జట్టు ఈ సవాల్ను స్వీకరించేందుకు సిద్దగంగా ఉందని కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది.
లెజండరీ పేసర్ జులన్ గోస్వామి రిటైర్మెంట్, మన్కడింగ్ వివాదాలను పక్కనబెట్టి విజయంతో ఈ టోర్నీని మొదలుపెట్టాలని హర్మన్సేన భావిస్తోంది. ఇంటర్నేషనల్ టీ20ల్లో భారత్కు పెద్దగా సక్సెస్ లేకపోయినా.. ఆసియాకప్లో మాత్రం ఎప్పుడూ ఫేవరెట్గానే బరిలోకి దిగుతున్నది. ఇప్పటి వరకు ఏడు సార్లు ఈ టోర్నీ జరిగితే భారత్ ఆరు సార్లు చాంపియన్గా నిలిచింది.
వన్డే ఫార్మాట్లో నాలుగు, టీ20 ఫార్మాట్లో రెండు టైటిల్స్ గెలుచుకుంది. 2018లో ఆతిథ్య బంగ్లాదేశ్ చేతిలో ఓడి రన్నరప్తో సరిపెట్టుకుంది. అయితే కొవిడ్ కారణంగా నాలుగేళ్లుగా మహిళల ఆసియాకప్ వాయిదా పడుతూ వచ్చింది. 2012 నుంచి ఈ టోర్నీని టీ20 ఫార్మాట్లో నిర్వహిస్తున్నారు.
ఇంగ్లండ్లో టీ20 సిరీస్ చేజార్చుకున్న భారత్.. ఆ తర్వాత వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఇదే జోరును ఇప్పుడు కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్, ఓపెనర్ స్మృతి మంధాన సూపర్ ఫామ్లో ఉండటం కలిసొచ్చే అంశం. అయితే షెఫాలీ వర్మ, సబ్బినేని మేఘన, హేమల టచ్లోకి రావాల్సి ఉంది. జులాన్ రిటైర్మెంట్తో పేస్ బౌలింగ్కు రేణుకా సింగ్ నాయకత్వం వహిస్తున్నది. ఈ టోర్నీలో నాలుగు సార్లు రన్నరప్గా నిలిచిన శ్రీలంక తొలి టైటిల్పై కన్నేసింది.
తుది జట్లు:
శ్రీలంక మహిళలు: హాసిని పెరెరా, చమరి ఆటపట్టు(కెప్టెన్), హర్షితా మాదవి, అనుష్క సంజీవని, నిలాక్షి డిసిల్వా, కవిషా దిల్హారీ, మాల్చా స్నేహని, ఒశాడి రణసింఘే, సుగందిక కుమారి, ఇనోక రణవీర, అచిని కులసురియా
భారత మహిళలు: షెఫాలీ వర్మ, స్మృతి మంధాన, హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), దయాలన్ హేమలత, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, స్నేహ్ రాణా, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్, రేణుకా సింగ్