
సిల్హెట్(బంగ్లాదేశ్): మహిళల ఆసియాకప్ ఫైనల్ బెర్త్ను పాకిస్థాన్ మహిళల జట్టు తృటిలో కోల్పోయింది. శ్రీలంకతో గురువారం ఉత్కంఠగా సాగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో పాకిస్థాన్ ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించిన ఈ లోస్కోరింగ్ గేమ్లో విజయాన్నందుకున్న శ్రీలంక ఈ నెల 15న భారత్తో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనుంది. గురువారమే జరిగే మరో సెమీఫైనల్లో థాయల్లాండ్పై భారత్ 74 పరుగులతో విజయం సాధించి ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఆసాంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో పాక్ చివరి బంతికి మూడు పరుగులు చేయలేక ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 122 పరుగులు చేసింది. లంక జట్టులో హర్షితా సమరవిక్రమా(41 బంతుల్లో ఫోర్తో 35), అనుష్క సంజీవని(21 బంతుల్లో ఫోర్, సిక్స్తో 26) టాప్ స్కోరర్లుగా నిలవగా.. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. పాక్ బౌలర్లలో నస్రా సంధు(3/17) మూడు వికెట్లు తీయగా.. సదియా ఇక్బాల్, నిదా దార్, అన్వర్ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. బిస్మా మరూఫ్(41 బంతుల్లో 4 ఫోర్లతో 42), నిదా దార్(26 బంతుల్లో 26) పోరాడినా ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో పాకిస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. 6 పరుగులు మాత్రమే వచ్చాయి. చివరి బంతికి మూడు పరుగులు కావాల్సిన సమయంలో చాకచక్యంగా వ్యవహరించిన శ్రీలంక రనౌట్ చేసి విజయాన్నందుకుంది.
కాగా ఇటీవలే ముగిసిన పురుషుల ఆసియా కప్ - 2022లో కూడా ఫైనల్ పాకిస్తాన్- శ్రీలంక మధ్య జరుగగా తుది పోరులో శ్రీలంక అనూహ్య విజయం సాధించి ట్రోఫీ నెగ్గిన విషయం తెలిసిందే. ఇక మహిళల ఆసియా కప్ సెమీస్ లో కూడా అదే ఫలితం రిపీట్ అయింది. మరి భారత్ తో ఫైనల్ పోరులో లంక.. హర్మన్ప్రీత్ కౌర్ సేనకు షాకిస్తుందా..? లేక ఓడిపోతుందా..? అనేది ఈ నెల 15న తేలనుంది. మహిళల ఆసియా కప్ ఇప్పటివరకు ఏడు ఎడిషన్లు ముగియగా.. ఇది 8వ ఎడిషన్. ఈ మెగా టోర్నీలో ఇండియా - శ్రీలంక లు 2004, 2005, 2006, 2008 లో ఫైనల్లో తలపడ్డాయి. ఈ నాలుగు దఫాలు భారత్ నే విజయం వరించింది.